రాసిస్తేనే..: టీబిల్లుపై దిగ్విజయ్, పటేల్లతో వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఏ విధమైన న్యాయం చేస్తారో లిఖితపూర్వకంగా ఇస్తేనే పార్టీలో చర్చించి తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు చెప్పారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ శుక్రవారం వెంకయ్యనాయుడిని కలిశారు.
బిజెపిని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని వారిద్దరు వెంకయ్యనాయుడిని కోరారు. సీమాంధ్రకు న్యాయం చేసే ప్రతిపాదనలు తాము చేశామని దిగ్విజయ్, అహ్మద్ పటేల్ వెంకయ్యనాయుడికి చెప్పారు.
సీమాంధ్రకు న్యాయం చేయడానికి చేసిన ప్రతిపాదనలపై తమకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని, అధికారికంగా తమకు అది ఇవ్వాలని, అప్పుడే తాము పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి. మద్దతుపై ప్రకటన చేస్తామని వెంకయ్య నాయుడు వారితో చెప్పారు. నోటి మాటలు సరిపోవని వెంకయ్యనాయుడు వారితో చెప్పారు. సీమాంధ్ర కోసం చేసిన ప్రతిపాదనలను తమకు అధికారికంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) సభ్యుడు జైరాం రమేష్ గురువారం రాత్రి వెంకయ్య నాయుడితో సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నివేదికపై చర్చించారు.