చావులోనూ ఒక్కటై.. కరోనా కాటుకు ఒకే చితిపై... ఆర్మీ మాజీ బ్రిగేడియర్,ఆయన సతీమణి కన్నుమూత...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేలాది కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తోంది. ఎప్పుడు ఎవరి గురించి ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియని స్థితి నెలకొంది. తాజాగా కుమావున్ రెజిమెంట్ వ్యవస్థాపకుడు,మాజీ బ్రిగేడియర్ ఆత్మ సింగ్(96) కరోనాతో కన్నుమూశారు. ఆత్మ సింగ్ మరణించిన కొద్ది గంటలకే ఆయన సతీమణి సరళా ఆత్మ(84) కూడా కరోనాతో మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలను ఒకే చితిపై పేర్చి దహన సంస్కారాలు నిర్వహించారు. బతికినంత కాలం అమితమైన ప్రేమానురాగాలతో ఒకరికొకరు తోడు నీడగా బతికిన జంట... చావులోనూ ఇలా ఒక్కటవ్వడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ఆత్మ సింగ్ కుమార్తె ఏమంటున్నారు...
ఆత్మ సింగ్ పెద్ద కూతురు,హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి మాట్లాడుతూ...'తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి ఈ లోకాన్ని విడిచిపెట్టడం మాకు తీరని బాధను మిగిల్చింది. అమ్మ-నాన్న ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమతో ఉండేవారు. మా నాన్న ఎప్పుడూ ఒక మాట అంటుండేవాడు... తన మరణం పట్ల దు:ఖ స్థితిలో మా అమ్మను విడిచి వెళ్లనని. ఇవాళ ఇంట్లోనే ఆయన కన్నుమూశారు. మా అమ్మ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఇండియన్ ఆర్మీ ఆ ఇద్దరి మృతదేహాలను ఒకే చితిపై పేర్చి దహన సంస్కారాలు నిర్వహించింది. వాళ్లిద్దరూ పర్ఫెక్ట్ కపుల్...' అని చెప్పారు.
ఆర్మీలో ఆత్మ సింగ్ ప్రస్థానం...
ఆత్మ సింగ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... బ్రిగేడియర్ ఆత్మ సింగ్ 1971లో ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారని చెప్పారు. ఆ యుద్ధంలో 17వ కుమావున్ రెజిమెంట్కు ఆత్మ సింగ్ నేత్రుత్వం వహించినట్లు తెలిపారు. ఆయన ఆర్మీలో చేరిన కొత్తలో 31వ కుమావున్ రెజిమెంట్లో పనిచేశారని ఆ తర్వాత 17వ కుమావున్ రెజిమెంట్లో పనిచేశారని చెప్పారు. 1968లో ఏర్పడిన కుమావున్ రెజిమెంట్కు ఆయన వ్యవస్థాపకుడని తెలిపారు. ఆత్మ సింగ్ ఇచ్చిన యుద్ధ నినాదం... జై రామ్ సర్వ్ శక్తి మాన్.. ఇప్పటికీ ఆర్మీలో మారుమోగుతోందన్నారు.
నాలుగు సర్జికల్ స్ట్రైక్స్...
'బ్రిగేడియర్గా మొత్తం నాలుగు సర్జికల్ స్ట్రైక్స్లో మా నాన్న పాల్గొన్నారు. ఇందులో మిజో తిరుగుబాటు కూడా ఉంది. ఆయన ఎప్పుడూ ధైర్యంగా ఉండేవారు. ఒకానొక వార్లో ఆయన పొత్తి కడుపుకు,చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఒక ధైర్యవంతుడైన దేశ సైనికుడిగా దేశం కోసం ఆయన ఎంతో చేశారు. ఆయన చాలా సింపుల్ వ్యక్తి. సైన్యాన్ని ప్రేమించేవారు... ఆయన రెజిమెంట్లోని సైనికులు,వారి కుటుంబ సభ్యుల గురించి జాగ్రత్తలు తీసుకునేవాడు.యుద్ధ సమయాల్లో ఆయన యుద్ధం గురించి తప్ప మరొకటి మాట్లాడేవారు కాదు. ఆయన మాకొక స్పూర్తివంతమైన వ్యక్తి.' అని కిరణ్ చౌదరి తెలిపారు.
గాయాలతో ఆస్పత్రిలో చేరినా యుద్ధం మాటే...
1971లో ఇండో-పాక్ యుద్ధంలో ఆత్మ సింగ్తో కలిసి పాల్గొన్న ఆర్మీ కెప్టెన్ ఆర్వైఎస్ చౌహాన్(76) మాట్లాడుతూ... 'నేను చివరిసారిగా 2018లో జరిగిన రెజిమెంట్ వార్షికోత్సవంలో ఆత్మ సింగ్ను కలిశాను. ఆయన వృద్దాప్యంలో ఉన్నప్పటికీ... ఆర్మీ కార్యక్రమాలకు హాజరై అధికారులతో మాట్లాడేవారు. ఆత్మ సింగ్ తాను కూడబెట్టిన డబ్బులో నుంచి సిల్వర్ ట్రోఫీలు కొనుగోలు చేసి... రెజిమెంట్ వార్షికోత్సవంలో ఆర్మీ అధికారులకు బహుకరించేవారు. ఇండో-పాక్ యుద్ధంలో డిసెంబర్ 9,1971న ఆత్మ సింగ్ ప్రత్యర్థుల కాల్పుల్లో గాయపడ్డాడు. పొత్తి కడుపులో,చేతులకు గాయాలై ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోనూ ఆయన యుద్ధం గురించే మాట్లాడుతుండేవారు. 17వ కుమావున్ రెజిమెంట్కు ఆయన తండ్రి లాంటి వారు. ఆయన నేత్రుత్వంలోని రెజిమెంట్లోని సబార్డినేట్స్ అంతా సురక్షితంగా ఫీలయ్యేవారు.' అని చెప్పుకొచ్చారు.