జయతో ఒత్తిడిలో విజయకాంత్: రాజపక్ష వద్దని మోడీకి
చెన్నై/ఇస్లామాబాద్: డిఎండికె అధ్యక్షులు, ప్రముఖ హీరో విజయకాంత్ ఒత్తిడిలో పడిపోయారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను ఆహ్వానించవద్దని తమిళ పార్టీలు గొంతు చించుకుంటున్న విషయం తెలిసిందే. వారి బాటలోనే విజయకాంత్ నడుస్తున్నారు.
విజయకాంత్ ఎన్డీయేలో భాగస్వామి కావడం గమనార్హం. మూడు రోజుల క్రితం ఎన్డీయే సమావేశంలో నరేంద్ర మోడీ... విజయకాంత్ను, ఆయన సతీమణి ప్రేమలతలను ప్రత్యేకంగా అభినందించారు. తమను ప్రత్యేకంగా మోడీ గుర్తించడంపై వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
అయితే ఇప్పుడు విజయకాంత్ ఒత్తిడిలో పడిపోయారు. తన ప్రమాణ స్వీకారానికి మోడీ.. పాకిస్తాన్ ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడు సహా సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షకు ఆహ్వానం పంపడంపై తమిళ పార్టీలు మండిపడుతున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, డిఎంకె పార్టీ అధ్యక్షులు కరుణానిధిలతో పాటు పలు పార్టీలు, నాయకులు రాజపక్షకు ఆహ్వానం పంపించడాన్ని వ్యతిరేకించాయి. మూడు రోజులుగా తమిళ పార్టీలు దీనిపై తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి.
వైగో బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ను కలిసి రాజపక్షను ఆహ్వానించవద్దని కోరారు. అయితే దీనిపై ఇప్పటి వరకు విజయకాంత్ స్పందించలేదు. అన్ని తమిళ పార్టీలు, నాయకులు మూకుమ్మడిగా రాజపక్ష రాకను వ్యతిరేకిస్తుండటంతో విజయకాంత్ కూడా గొంతు కలపక తప్పలేదు. మోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్షను ఆహ్వానించవద్దని బిజెపిని కోరారు. ఎస్ఎంకె చీఫ్ శరత్ కుమార్ కూడా రాజపక్షకు ఆహ్వానం పంపించడాన్ని ఖండించారు.
సాయంత్రం ప్రకటన చేయనున్న పాకిస్తాన్
తన ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ను మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారానికి షరీఫ్ వస్తారా లేరా అనే విషయమై పాకిస్తాన్ సాయంత్రం ప్రకటన చేసే అవకాశముంది. కాగా, మోడీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.