లక్ష్మణ్ ఖాతా హ్యాక్: నిందితుడి పేరు మీద 30 ఖాతాలు
లక్ష్మణ్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించారు. కోల్కత్తాలోని నార్త్ బిదానా నగర్లోని ఓ అకౌంట్కు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైం బృందం కోల్కత్తా వెళ్లింది. అక్కడ స్థానిక పోలీసుల సహాయంతో బ్యాంకు వద్ద వలపన్ని అజీజ్ను అరెస్ట్ చేసింది. అనంతరం నిందితుడ్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టింది.
సైబరాబాద్ పోలీసులు నిందితుడు అజీజ్ ఉల్ షేక్ను తమకు అప్పగించాలని స్థానిక కోర్టు అనుమతి తీసుకుని నగరానికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. నిందితుడు అజీజ్ గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డాడ అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.
కాగా, తన పేరిట కోల్కతాలో 30 నుండి 40 ఖాతాలు ఉన్నాయని, వాటిలోకి ఎక్కడెక్కడి నుండో డబ్బులొస్తాయని, వాటిలో తనకు రెండు శాతం కమిషన్ ఇస్తారని ఇజాజుల్ పోలీసుల విచారణలో చెప్పాడు. బ్యాంకు ఖాతాల వివరాలన్ని రాజు అనే వ్యక్తికి తెలుసునని చెప్పిన ఇజుజుల్ ఆ రాజు ఎవరనే విషయంపై పూర్తి సమాచారం ఇవ్వలేదట.
మరోవైపు, ఒకటి రెండు రోజుల్లో సైబరాబాద్ పోలీసులు ఇజుజుల్ను హైదరాబాదులోని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు అతని కస్టడీ కోరే అవకాశముంది.