లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేస్తే ఉత్పాతమే..! డబ్య్లూహెచ్ఓ హెచ్చరికలు..! అదే బాటలో భారత్..!!
హైదరాబాద్ : భారత దేశంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశాలు లాక్డౌన్ నిబంధనలు సడలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్డౌన్ ఆంక్షలు సడలించవద్దని సూచించింది. కోవిడ్ కట్టడికి పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు ఆశావహంగా ఉన్నాయని పేర్కొంంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ నిబంధనలు సడలించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటి వరకూ లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర దేశాలకు గుర్తు చేస్తోంది.
Recommended Video
కరోనా విలయ తాండవం చేస్తోంది.. ఏమరు పాటుగా ఉండొద్దని డబ్య్లూహెచ్ఓ వార్నింగ్..
ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 34 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 2లక్షల 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సుమారు 11 లక్షల మంది కోలుకోవడం కాస్త ఊరట కలిగించే పరిణామంగా చర్చ జరగుతోంది. మరో 20 లక్షల మందికి కూడా కరోనా వైరస్ లక్షణాలు సోకినట్టు తెలుస్తోంది. వీరిలో దాదాపు 55 వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అమెరికాలో 24 గంటల వ్యవధిలో 2,053 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మొత్తం మృతుల సంఖ్య 65 వేలు దాటింది. మరోవైపు, అమెరికా వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 11లక్షల 31 వేలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
పెరుగుతున్న పాజిటీవ్ కేసులు.. అప్రమత్తంగా ఉండాలని డబ్య్లూహెచ్ఓ సూచనలు..
అంతే కాకుండా భారతదేశం లోనూ వైరస్ వ్యాప్తి తగ్గటం లేదు. దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ ఆంక్షలు కూడా దేశంలో కరోనా విజృంభణను కట్టడి చేయలేకపోతోంది. ఇలాంటి తరుణంలో దేశ వ్యాప్తంగా శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37, 367కు చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటేసింది. గుజరాత్ లోనూ కరోనా విజృంభణ ఉధృతి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి విత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తే కరోనా వైరస్ మరింత విలయ తాండవం చేసే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేయడం ఉత్కంఠగా మారింది.
అలర్డ్ ఐన బారత్.. ఆంక్షల విషయంలో రాజీ లేదని ప్రకటన..
డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యలో దేశంలో మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోం శాఖ. మే నాలుగో తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగుతుందని హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో తాజా పరిస్థితిని సమీక్షించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ పేర్కొంది. మార్చి నెలాఖరు నుండి దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ ఊహించని ఫలితాలను ఇచ్చిందని, తాజాగా కరోనా వైరస్ ప్రభావం, ప్రమాదం ఇంకా తొలగి పోనందు వల్ల లాక్ డౌన్ను మరి కొంత కాలం పొడిగించాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
లాక్ డౌన్ కొనసాగుతుంది.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న కేంద్ర హోం శాఖ..
అందుకనుగుణంగా మే నాలుగో తేదీ నుంచి మరో రెండు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దాంతో పాటు లాక్ డౌన్ను మరో రెండు వారాల పాటు అంటే మే 17వ తేదీ వరకు పొడిగించిన హోం శాఖ కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రెడ్ జోన్లలో కచ్చితమైన ఆంక్షలను అమలు చేయడంతోపాటు, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా వైరస్ వున్న ప్రాంతాలను స్పష్టంగా గుర్తించి ఆ ప్రాంతాలలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో పాటు కఠిన ఆంక్షలకు సంబంధించిన సమాచారాన్ని హోం శాఖ రాష్ట్రాలకు చేరవేసింది.