ముఖ్యమంత్రి చెప్పినా నో చెప్పిన మలయాళీ సూపర్ స్టార్
తిరువనంతపురం: ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసిన 1.63 కోట్ల రూపాయల చెక్కును వెనక్కి తీసుకునేందుకు మలయాళీ సూపర్ స్టార్ మోహన్లాల్ నిరాకరించారు. తన సారథ్యంలో నిర్వహించిన జాతీయ క్రీడల ప్రారంభోత్సవ వేడుక ఫ్లాప్ అయినందుకు తీవ్ర విమర్శలు రావడంతో అతను చెక్ వెనక్కిచ్చేసిన విషయం తెలిసిందే. దానిని వెనక్కి తీసుకోమని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చెప్పినప్పటికీ మోహన్ లాల్ దానిని తీసుకోనని చెప్పారు.
కాగా, కేరళ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ 'లాలిసోమ్' బ్యాండ్ కచేరీ ప్రేక్షకులను తీవ్ర నిరాశపరడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా తాను తీసుకున్న రూ.1.6 కోట్లు వెనక్కి ఇచ్చేస్తానని మోహన్ లాల్ ప్రకటించారు.
ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ కొద్ది రోజుల క్రితం స్పందిస్తూ ఆ డబ్బుని తిరిగి తీసుకోబోమన్నారు. "మోహన్ లాల్ నుంచి డబ్బు స్వీకరించం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. లీగల్ కాంట్రాక్టులో భాగంగా ఆ డబ్బునిచ్చాం" అని చాందీ పేర్కొన్నారు.
మోహన్ లాల్కు ప్రముఖ నటుడు మమ్ముట్టి కూడా మద్దతు ప్రకటించారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 'ఒక కార్యక్రమం నిర్వహించడానికి కళాకారులు ఎంతో కష్టపడతారు. మోహన్ లాల్ మనకు గర్వకారణం. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ఆయన స్ఫూర్తిని అందరూ అభినందించాల'న్నారు. దీంతో పాటు మోహన్ లాల్కు అండగా నిలబడాలని మిగిలిన నటులకు కూడా పిలుపునిచ్చారు.