అయోధ్య నదీతీరాన శ్రీరాముడి భారీ విగ్రహం ఏర్పాటు, యోగి ప్రభుత్వం ప్రణాళికలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయోధ్యలో భారీ శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఉత్తరప్రదేశ్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయోధ్యలో భారీ శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే క్రమంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వాధికారులు వెల్లడించారు.
'అయోధ్యలో ప్రవహిస్తోన్న సరయు నది పరివాహక ప్రాంతంలో శ్రీరామచంద్ర మూర్తి భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇండోనేషియాలో బాలీ నది ఒడ్డున ఎన్నో విగ్రహాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ఆలోచన అందరికీ నచ్చడంతో అదే థీమ్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని యూపీ మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదట రాముని విగ్రహాన్ని నిర్మిస్తాం' అని రాష్ట్ర పర్యాటక ప్రతినిధి అవనీశ్ తెలిపారు.
అయితే విగ్రహం ఎంత ఎత్తు ఉండాలన్న విషయమై ఇంకా చర్చించాల్సి ఉందని, 100 మీటర్లు అంటూ మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.
'హిందువులకు అయోధ్య ఎంతో పవిత్రమైన స్థలం. దీపావళికి ముందు రోజు ప్రభుత్వం తరఫున ఇక్కడ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. అందుకు ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆ రోజు సరయు ఒడ్డున హారతి నిర్వహించాలని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు..' అని పర్యాటక ప్రతినిధి అవనీశ్ వెల్లడించారు.