ఇంగ్లాండ్లో దారుణం: పార్కులో వాకర్లపై..: పరిస్థితి అదుపులో ఉందన్న హోం మంత్రి ప్రీతి పటేల్
లండన్: ఇంగ్లాండ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. ఇంగ్లాండ్ నైరుతి ప్రాంతంలోని ప్లైమౌత్ సిటీలో ఆ దేశ కాలమానం ప్రకారం..గురువారం సాయంత్రం ఈ ఘటన సంభవించింది. మృతుల్లో ఓ మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. అనంతరం కాల్పులకు తెగబడ్డ దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని మరణించాడు. ఈ ఉదంతం పట్ల ఇంగ్లాండ్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. షాకింగ్ ఘటనగా ఆ దేశ హోం మంత్రి అభివర్ణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అనుమానించట్లేదని డెవాన్ అండ్ కార్న్వాల్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారొక ప్రకటన విడుదల చేశారు.
ఇంగ్లాండ్లో గన్ కల్చర్..
సాధారణంగా సామూహిక కాల్పుల తరహా ఉదంతాలు అమెరికాలో అధికంగా కనిపిస్తుంటాయి. తుపాకుల సంస్కృతి అనేది అగ్రరాజ్యంలో తరచూ వెలుగులోకి వస్తుంటుంది. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పబ్స్ వంటి చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడిన సందర్భాలకు సంబంధించిన వార్తలు అమెరికాలో తరచూ చూస్తుంటాం. అకారణంగా అమాయకుల ప్రాణాలను తీసే అలాంటి గన్ కల్చర్ అనేది బ్రిటన్లో అసాధారణంగా భావిస్తుంటారు. ఇంగ్లాండ్లో ఇలాంటివి చాలా తక్కువ, తాజాగా- ఇక్కడ కూడా అలాంటి ఉదంతం చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.
అయిదేళ్ల చిన్నారిపైనా..
ఈ కాల్పుల వెనుక షరాన్ టర్నర్ అనే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. తొలుత- టర్నర్ డెవాన్ అండ్ కార్న్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కీహ్యామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి తుపాకీతో జొరబడ్డారు. ఆ ఇంట్లో నివసిస్తోన్న ఓ మహిళ, అయిదు సంవత్సరాల వయస్సు ఉన్న అమె కుమార్తెపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతను సెమీ ఆటోమేటిక్ తుపాకీని వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తల్లీ కుమార్తెలపై కాల్పులు జరిపిన తరువాత అతను ఆ ఇంటి వెనుక భాగంలో ఉన్న ఓ పార్క్లోకి పరారయ్యారు. సాయంత్రం పూట వాకింగ్కు వచ్చిన ముగ్గురిపైబులెట్ల వర్షాన్ని కురిపించారు.
ఉద్రిక్తంగా ప్లైమౌత్
సమాచారం అందుకున్న వెంటనే డెవాన్ అండ్ కార్న్వాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా.. అతను తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనతో ప్లైమౌత్ సిటీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కీహ్యామ్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, అంబులెన్సు సైరన్ మోతలతో హోరెత్తింది. ఆరు మృతదేహాలను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు తొలుత వ్యక్తమయ్యాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేశారు. షరాన్ టర్నర్ నేపథ్యం గురించి ఆరా తీశారు.
సిటీలో హైఅలర్ట్..
అనంతరం పోలీసులు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. సాయంత్రం 6:10 నిమిషాలకు తొలిసారిగా కాల్పులు ఆరంభమైనట్లు తెలిపారు. ఈ దారుణ ఘటనను ఉగ్రవాద చర్యలతో సంబంధం లేదని పేర్కొన్నారు. దీన్ని ఉన్మాద చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. షరాన్ టర్నర్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే విషయంపై విచారణ చేపట్టామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు, ప్లైమౌత్ సిటీలో హైఅలర్ట్ను ప్రకటించామని డెవాన్ అండ్ కార్న్వాల్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో తనిఖీలను సైతం చేపట్టినట్లు స్పష్టం చేశారు.
Recommended Video
పరిస్థితి అదుపులో ఉందంటూ..
ఈ ఘటన పట్ల బ్రిటన్ హోం శాఖ మంత్రి, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ స్పందించారు. ప్లైమౌత్ సిటీలో చోటు చేసుకున్న కాల్పుల ఉదంతం తనను దిగ్భ్రాంతి కలిగించిందని వ్యాఖ్యానించారు. సమాచారం అందిన వెంటనే తాను ప్లైమౌత్ సిటీ పోలీస్ అధికారులతో మాట్లాడానని చెప్పారు. ప్రజలు ఆందోళనకు గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగించే విషయంలో ఎలాంటి సహాయ, సహాకారాలు అవసరమైనప్పటికీ..అందజేస్తామని ప్రీతి పటేల్ ప్లైమౌత్ పోలీసు యంత్రాంగానికి హామీ ఇచ్చారు. పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించొద్దని ఆమె స్థానికులకు సూచించారు.