తీవ్రమైన గుండెపోటు: పాక్ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం మృతి?
దావూద్ ఇబ్రహీం ఇప్పుడు కదలలేని పరిస్థితిలో పాకిస్తాన్లోని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. అతను మరణించాడని కూడా ప్రచారం సాగుతోంది.
న్యూఢిల్లీ: మాఫియా డాన్, ముంబై పేలుళ్ల కేసు నిందితుడు దావూద్ ఇబ్రహీం (62) తీవ్రమైన గుండెపోటుతో పాకిస్తాన్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, అతను వెంటిలేటర్పై రోజులు లెక్కపెడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్లోని కరాచీలో ఉంటున్న అతడికి ఇటీవల తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చిందని, దాంతో అతడిని కరాచీ ఆస్పత్రిలో చేర్చినట్లు అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
బ్రెయిన్ ట్యూమర్ను తొలగించేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు, ఆది విఫలమైనట్లు చెబుతున్నారు. దాంతో అతడికి వెంటలేటర్పై ఉంచినట్లు చెబుతున్నారు.నిత్యం సైన్యం పహరాలో ఉండే కరాచీలోని క్లిఫ్టన్ రోడ్డులో దావూద్ నివసిస్తున్నాడు, 20 రోజుల క్రితం తీవ్రస్థాయిలో పక్షవాతం వచ్చింది. కుడి వైపు శరీరం మొత్తం చచ్చుబడిపోయిందని ఓ వార్తాసంస్థ తెలిపింది.
చావుబతుకుల మధ్య ఉన్న డాన్ను ఈ నెల 22న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడి మెదడులో కణితి ఉందని, దాన్ని తొలగించాలని వైద్యులు సూచించారు. పాకిస్థాన్కు చెందిన అగ్రశ్రేణి వైద్య నిపుణులు ఆపరేషన్ చేశారు. కానీ అది విపలమైంది. దాంతో చావుబతుకుల్లో దావూద్ కొట్టుమిట్టాడుతున్నాడని తెలిసింది.
ఈ వార్త తెలిసి భారత్లోని దక్షిణ ముంబైలోని దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ ఇంటికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అతడి బంధువులు పలువురు దావూద్ ఆరోగ్యమెలా ఉందో తెలుసుకోవడానికి బారులు తీరారు. డాన్ క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసినట్లు తెలుస్తోంది.
మూడేళ్ల క్రితం.. దావూద్ తాను చనిపోతే ఖననం చేయడానికి దక్షిణ ముంబై చుర్నీరోడ్లోని బడా ఖబరస్థాన్లో స్థలాన్ని కూడా బుక్ చేసుకున్నాడని తెలిసింది. 2014లో ముంబై మిర్రర్ ఈ వార్తను ప్రచురించింది. ఈ ఖబరస్థాన్లోనే దావూద్ తండ్రి ఇక్బాల్ కస్కర్ సమాధి ఉంది. దాని పక్కనే చోటు కొనుక్కున్నట్లు తెలిసింది. ముంబై పేలుళ్ల కుట్రదారైన దావూద్ పాక్లో తలదాచుకుంటున్నాడని, అతడిని తమకు అప్పగించాలని భారత ఎప్పటి నుంచో కోరుతోంది. అతడు తమ వద్ద లేడని పాక్ బుకాయిస్తూనే ఉంది.