కరోనా థర్డ్వేవ్: లాక్డౌన్లోకి జారిపోయిన మరో దేశం: ఏప్రిల్ 18 వరకు కంప్లీట్గా
బెర్లిన్: మరో దేశం పూర్తిగా లాక్డౌన్లోకి జారిపోయింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి భయానకంగా విస్తరిస్తోన్న పరిస్థితులను దృఫ్టిలో ఉంచుకుని జర్మనీలో లాక్డౌన్ విధించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా పూర్తిగా లాక్డౌన్ విధించినట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. అయిదు రోజుల ఈస్టర్ హాలిడేస్లను ప్రజల్లో ఇళ్లల్లోనే జరుపుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా వైరస్ థర్డ్వేవ్ ఆరంభమైందని వెల్లడించారు.
Recommended Video
కొత్త ముఖ్యమంత్రికి కరోనా: ఢిల్లీ టూర్ క్యాన్సిల్: మోడీపై ఆ కామెంట్స్ చేసిన మరుసటి రోజే
జర్మనీ వ్యాప్తంగా ఏడు రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసులు 107 శాతం మేర నమోదయ్యాయి., 68 వారాల తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు రికార్డ్ కావడం ఇదే తొలిసారి. 16 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ లాక్డౌన్ను విధించాల్సి వచ్చిందని ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఆయా రాష్ట్రాల స్థానిక ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వారిని సంప్రదించిన తరువాతే కంప్లీట్ లాక్డౌన్ విధించామని తెలిపారు.
జర్మనీలో ఇప్పటిదాకా 26,78,262 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75,418 మంది మరణించారు. 24,23,400 మంది రికవరీ అయ్యారు. 1,79,444 యాక్టివ్ కేసులు జర్మనీలో కొనసాగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కేసుల పెరుగుదల అనూహ్యంగా ఉంటోందని జర్మనీ రాబర్ట కోచ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించింది. ప్రతి లక్ష మంది జనాభాకు 107 మంది వైరస్ బారిన పడుతున్నారని వెల్లడించింది. దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. కొద్దిరోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించడమే దీనికి ప్రత్యామ్నాయమని సిఫారసు చేసింది.
దీనితో ఏప్రిల్ 18వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించినట్లు ఏంజెలా మెర్కెలో తెలిపారు. ఆ తరువాత కేసుల పెరుగుదలలో క్షీణత కనిపిస్తే.. లాక్డౌన్ను సడలిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి జర్మనీలో అయిదు రోజుల ఈస్టర్ హాలిడేస్ను ప్రకటించారు. లాక్డౌన్ను విధించినందు వల్ల ఈస్టర్ హాలిడేస్ను ప్రజలు ఇళ్లల్లోనే గడపాలని ఛాన్సలర్ సూచించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ థర్డ్వేవ్ కొనసాగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.