ఖతర్ ఫీఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభానికి ముందే పెను వివాదం
దోహా: ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలివున్నాయి. ఖతర్ వేదికగా ప్రతిష్ఠాత్మక ఫీఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభం కాబోతోంది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 9:30 గంటలకు తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. గ్రూప్ ఏలో ఉన్న ఖతర్, ఈక్వెడార్ పోటీ పడనున్నాయి. రాజధాని దోహాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ ఖోర్ సిటీ దీనికి వేదికగా మారింది. వచ్చేనెల 18వ తేదీ వరకు ఈ మెగా గ్రాండ్ ఈవెంట్ కొనసాగుతుంది. లుసైల్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది.
సాకర్ సూపర్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబప్పె, పాల్ పోగ్బా, నెయ్మార్ జూనియర్, హ్యారీ కేన్ వంటి ప్లేయర్ల మెరుపులను ఈ నెల రోజుల పాటు చూసెయ్యొచ్చు. 32 దేశాలు ఈ ఫీఫా వరల్డ్ కప్లో పోటీ పడనున్నాయి. ఖతర్ సహా అర్జెంటీనా, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, పోర్చుగల్, జర్మనీ, నెదర్లాండ్స్, ఉరుగ్వే, క్రొయేషియా, డెన్మార్క్, మెక్సికో, అమెరికా, సెనెగల్, వేల్స్, పోలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
అంతా బాగానే ఉన్నప్పటికీ- ఈ ఫీఫా వరల్డ్ కప్ ప్రారంభానికి అంతా సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో సరికొత్త వివాదం చుట్టుకుంది. భారత్కు చెందిన ప్రముఖ ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్.. ప్రపంచకప్ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఈ మేరకు ఆయనకు ఖతర్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం కూడా అందింది. ప్రస్తుతం ఆయన ఖతర్కు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇది కాస్తా దుమారం రేపుతోంది.
జకీర్ నాయక్ ప్రసంగాలను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. చాలా సంవత్సరాల కిందటే ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. జకీర్ నాయక్ను కూడా నిషేధించింది. దీనితో ప్రస్తుతం ఆయన మలేషియాలో తలదాచుకుంటోన్నారు. భారత్కు వస్తే జకీర్ నాయక్ అరెస్ట్ తప్పదు. ముంబైలో గల ఆయన ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు మూసివేశారు. దేశవ్యాప్తంగా ఆయన కార్యాలయాలన్నింటినీ అధికారులు సీజ్ చేశారు.
జకీర్ నాయక్ ఇచ్చే వివాదాస్పద ప్రసంగాలే దీనికి కారణం. హేట్ స్పీచ్ను నిషేధించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జకీర్ నాయక్ కార్యకలాపాలన్నింటిపైనా ఉక్కుపాదం మోపింది. దీనితో ఆయన చాలాకాలం నుంచీ భారత్లో నివసించేట్లేదు. మలేసియాలో ఉంటోన్నారు. ఈ ఫీఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభోత్సవం సందర్భంగా ఖతర్ ప్రభుత్వం.. ఆయనను ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.