కొత్త తరహా అణ్వాయుధాల అభివృద్ధిలో పాక్.. భారత్కే కాదు, అమెరికాకూ దెబ్బే!
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్ తన వద్ద ఉన్న అణ్వాయుధాలు సరిపోవన్నట్లు.. కొత్త తరహా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా పసిగట్టింది. అంతేకాదు, ఈ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడతాయేమో అనేది అమెరికా ఆందోళన.
మరోవైపు పాకిస్తాన్ చర్య భారత్కు కూడా దెబ్బే. ఇప్పటికే భారత్లో సుస్థిరతను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు. భారత కరెన్సీని ముద్రించడం దగ్గర్నించి, తీవ్రవాదులను ఉసిగొల్పడం వరకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్పై అది భారీ దాడికి పాల్పడే అవకాశాలున్నట్లు సమాచారం.
పాక్ చర్యలతో పొంచి ఉన్న ముప్పు...
పాకిస్తాన్ కొత్త తరహా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని, ఇది తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవని, వీటి కారణంగా దక్షిణాసియా ప్రాంతానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ హెచ్చరికలు చేసింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సాక్షాత్తు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ డాన్ కోట్స్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్గత భద్రత, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ లాంటి సమస్యలతో సతమతమవుతోన్న పాక్, వాటి నుంచి తన దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైన చర్యలకు దిగుతోందని అన్నారు.
భారత్పై మరోసారి భారీ ఉగ్రదాడి?
‘పాకిస్తాన్ నిరంతరం అణ్వాయుధాల అభివృద్ధిని కొనసాగిస్తూనే ఉంది. ఇందులో కొత్త రకం ఆయుధాలున్నాయి. వీటిలో స్వల్ప శ్రేణి వ్యూహాత్మక ఆయుధాలు, సముద్రతలం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు, గగనతలంలో వినియోగించే క్రూయిజ్ క్షిపణులు, సుదూర లక్ష్యాలను చేరుకునే బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి..' అని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, పాకిస్తాన్.. భవిష్యత్తులో భారత్పై మరోసారి భారీ ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
చైనాకు మరింత చేరువగా...
ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్లో దాడులు కొనసాగిస్తున్నాయి. ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని కూడా డాన్ కోట్స్ ప్రస్తావించారు. అంతేకాదు ఆయన అంచనా ప్రకారం.. పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు పెంచుకుంటూ, వారికి మరింత సహకారం అందిస్తూ.. మరోవైపు చైనాకు మరింత చేరువవుతోంది. పాక్ దుశ్చర్యలు మున్ముందు అమెరికా ప్రయోజనాలను కూడా దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదులకు పాక్ మద్దతు...
ఇటీవల జమ్మూలోని సుంజ్వాన్ సైనిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడిన తరువాత అమెరికా ఇంటెలిజన్స్ చీఫ్ డాన్ కోట్స్ పాకిస్తాన్ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్తాన్ మద్దతు లభిస్తుండడాన్ని అవకాశంగా తీసుకుంటున్న ఉగ్రవాద సంస్థలు ఇటు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడంతోపటు అటు భారత్, అఫ్ఘానిస్తాన్లపై దాడులకు పాల్పడే ప్రమాదముందని ఆయన హెచ్చరిస్తున్నారు. మరోసారి భారత్పై భారీ ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉందని డాన్ కోట్స్ పరోక్ష హెచ్చరికలు జారీచేశారు.