Imran Khan : ఇమ్రాన్ ఖాన్ కు మరో ఝలక్ ? పీటీఐ పార్టీ ఛీఫ్ గానూ తప్పించబోతున్న ఈసీ..
పాకిస్తాన్ లో ప్రధానిగా పనిచేసి ఈ ఏడాది పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్ కు రాబోయే రోజుల్లో మరింత గడ్డుకాలం తప్పేలా లేదు. ఇప్పటికే ప్రధాని పదవి నుంచి అవమానకర రీతిలో తప్పుకున్న ఇమ్రాన్ ను త్వరలో తన సొంత పార్టీ పీటీఐ ఛీఫ్ గానూ తొలగించేందుకు ఎన్నికల సంఘం ఇవాళ చర్యలు ప్రారంభించింది.
తోషఖానా ఖజానా అక్రమాల కేసులో ఇమ్రాన్ ఖాన్ ను పీటీఐ ఛీఫ్ గా అనర్హుడిగా ప్రకటించేందుకు ఈసీ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. తోషఖానా అనే రాష్ట్ర ఖజానా విభాగం నుంచి డిస్కౌంట్ ధరకు అందుకున్న ఖరీదైన గ్రాఫ్ చేతి గడియారంతో సహా బహుమతులను కొనుగోలు చేసి లాభాల కోసం వాటిని విక్రయించినందుకు ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది. తప్పుడు ప్రకటనలు చేసినందుకు, తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినందుకు ఇమ్రాన్ ను అనర్హుడుగా ప్రకటించారు. ఈ కేసుపై ఈ నెల 13న కోర్టు విచారణ చేయబోతోంది.
పాకిస్తానీ చట్టాల ప్రకారం విదేశీ బహుమతులను పొందిన వారు వాటిని తమ వద్ద ఉంచుకోవడానికి ముందు వాల్యుయేషన్ కోసం తోషాఖానా లేదా ట్రెజరీలో జమ చేయాల్సి ఉంది. ప్రభుత్వంలోని అధికారులు వారు స్వీకరించే బహుమతుల గురించి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ వారు పూర్తి విలువను వెల్లడించనవసరం లేదు. పెద్ద బహుమతులు తోషఖానాకు పంపబడతాయి. అయినప్పటికీ గ్రహీత వాటిని 50 శాతం వరకు తగ్గింపుతో తిరిగి కొనుగోలు చేయవచ్చు. కానీ ఇమ్రాన్ ఖాన్ ఈ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా వాటిని డిస్కౌంట్ ధరకు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టు తీర్పుకు ముందే ఈసీ అనర్హత ప్రక్రియ ప్రారంభిస్తోంది.