EB-5 వీసాలపై ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఏ సమయంలో ఎలాంటి బాంబు వేస్తాడోనని ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. ఉన్న ఫలంగా షాకులు ఇవ్వడం ట్రంప్కు అలవాటుగా మారింది. ఇప్పటి వరకు అమెరికా వీసాల నిబంధనలతో బయటి దేశాల ప్రజలకు నిద్దర లేకుండా చేసిన ట్రంప్... తాజాగా వీసాల విషయంలో వ్యాపారవేత్తలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. త్వరలో ఈబీ5 వీసాలను రద్దు చేసే యోచనలో కానీ... సంస్కరణలు తెచ్చే యోచనలో గానీ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై అమెరికా కాంగ్రెస్కు తెలిపారు ట్రంప్.
ఈబీ5 వీసా విదేశీయులకు జారీ చేసే వీసా. వ్యాపారవేత్తలు అమెరికాలో కనీసం ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.6.8 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరిస్తే వారికి ఈబీ5 వీసా జారీ చేస్తారు. ఇది గ్రీన్ కార్డుతో సమానం. ఈ వీసా పొందిన వారు మోసాలకు పాల్పడుతున్నారని, ఈ వీసాను మోసం చేసేందుకు ఒక ఆయుధంగా మలచుకుంటున్నారని ట్రంప్ దృష్టికి రావడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా చట్టసభ సభ్యులు కూడా ఏకీభవిస్తున్నారు. ఈబీ5 వీసా జారీని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ఈబీ5 రీజినల్ సెంటర్ ప్రోగామ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఇన్వెస్టర్లను, వ్యాపారులను మోసాల నుంచి కాపాడుకునేందుకు ఈబీ5 వీసాలను సంస్కరించాల్సి ఉందిని అమెరికా పౌర, వలస సేవల విభాగం డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా పేర్కొన్నారు.