సీరియస్గా సాగుతున్న చర్చలో ఒక్కసారిగా నవ్వులు... మోదీ చేసిన ఆ కామెంట్తో...
ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చలంటే ద్వైపాక్షిక అంశాలపై సీరియస్గా చర్చించడం కామన్.భారత ప్రధాని నరేంద్ర మోదీ,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీలోనూ పలు సీరియస్ అంశాలు చర్చకు వచ్చాయి. అయితే బైడెన్ ప్రస్తావించిన ఓ అంశం.. సీరియస్గా సాగుతున్న భేటీలో ఇద్దరి మధ్య నవ్వులు పూయించింది. బైడెన్ లేవనెత్తిన ఆ సరదా టాపిక్కు మోదీ కూడా తనదైన శైలో చతురోక్తులు విసరడంతో ఇద్దరు కాసేపు నవ్వుల్లో మునిగిపోయారు.

ఇంతకీ బైడెన్ ఏమన్నారు...
ఇంతకీ బైడెన్ ప్రస్తావించిన ఆ సరదా అంశమేంటంటే... తన పేరు కలిగినవాళ్లు ఇండియాలో ఐదుగురు ఉన్నారని మోదీతో ఆయన పేర్కొన్నారు.1972లో తాను మొదటిసారి అమెరికా సెనేట్కు ఎన్నికైనప్పుడు ముంబై నుంచి తనకో ఉత్తరం వచ్చిందన్నారు. ఆ ఉత్తరం రాసినవ్యక్తి.. అతని ఇంటి పేరు కూడా బైడెన్ అని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు.అయితే ఆ తరువాత దాని గురించి ఎలాంటి సమాచారం తెలియలేదన్నారు.

మోదీ కామెంట్తో ఇద్దరూ నవ్వేశారు...
మళ్లీ కొన్నేళ్ల తర్వాత తాను అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో ముంబైకి వచ్చినప్పుడు... కొంతమంది జర్నలిస్టులు ఆ లేఖ గురించి ప్రస్తావించారని చెప్పారు. ఆ తర్వాతి రోజు... భారత్లో ఐదుగురు బైడెన్లు ఉన్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయని గుర్తుచేశారు. అయితే వాళ్లెవరో.. వారి వివరాలేంటో తాను తెలుసుకోలేదన్నారు. మోదీతో తాజా భేటీ నేపథ్యంలో ఆ వివరాలేమైనా తెలుస్తాయేమోనని... ఆయనతో సరదాగా వ్యాఖ్యానించారు.మోదీ కూడా అంతే సరదాగా స్పందిస్తూ... అవును భారత్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని పత్రాలను తీసుకొచ్చానని చెప్పారు. భారత్లో ఉన్న బైడెన్లకు సంబంధించి అందులో వివరాలు ఉన్నాయని... బహుశా ఆ పత్రాలు మీకు ఉపయోపగపడుతాయేమోనని వ్యాఖ్యానించారు.అంతేకాదు,వారంతా మీ బంధువులేనంటూ కామెంట్ చేశారు.దీంతో బైడెన్,మోదీ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వేశారు.

ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త అధ్యాయం...
తాజా భేటీని భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త అధ్యాయంగా జో బైడెన్ అభివర్ణించారు.ఇరు దేశాల ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, అందులో కోవిడ్-19 ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.
భారత-అమెరికా సంబంధాల బలోపేతం ప్రపంచానికి మేలు చేస్తుందని... ఇరు దేశాల మధ్య ప్రజాస్వామిక విలువలతో కూడిన బంధం ఉందని పేర్కొన్నారు. 40 లక్షల మంది ఇండో- అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని పేర్కొన్నారు. భేటీ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు మహాత్మా గాంధీని గుర్తుచేసుకున్నారు. గాంధీ నడిచిన అహింసా మార్గం గురించి బైడెన్ ప్రస్తావించారు.ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కీలకంగా మారనుందని మోదీ పేర్కొన్నారు.సాంకేతికతను ప్రపంచ శ్రేయస్సు కోసం వినియోగించేలా మన ప్రతిభను ఉపయోగించుకోవాలన్నారు. భారత్- అమెరికా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ముందుకు సాగుతాయన్నారు.

ఆఫ్గన్పై స్పష్టమైన వైఖరి...
తాజా భేటీలో ఆఫ్గనిస్తాన్ అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు తాలిబన్లకు స్పష్టమైన సందేశం పంపించారు. ఆఫ్గనిస్తాన్లో మహిళలు,చిన్నారులు,మైనారిటీలు సహా అందరి హక్కులను తాలిబన్లు గౌరవించాలని సూచించారు. అంతేకాదు,ఆఫ్గనిస్తాన్ మరోసారి ఉగ్రవాదుల అడ్డాగా మారవద్దని పేర్కొన్నారు. ఆఫ్గన్ కేంద్రంగా ఇతర దేశాలకు ముప్పు తలపెట్టే ఉగ్ర కార్యకలాపాలకు తావు ఉండకూడదన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానం 2593(2021)కి తాలిబన్లు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications