జాతరలో అపశృతి, అగ్నిగుండంలో పడిపోయిన యువతి, గాయాలు..
అగ్నిగుండం దాటితే మంచి జరుగుతోందని, చేసిన పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. కానీ కొన్నిసార్లు అగ్నిగుండం దాటే సమయంలో ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. నల్గొండ జిల్లా చెరువుగట్టులో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అగ్నిగుండంలో నడుస్తోన్న యువతి ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే స్థానికులు, పోలీసులు ఆమెను కాపాడారు. ప్రథమి చికిత్స అందించారు.
అగ్నిగుండం..
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం కల్యాణోత్సవం జరగగా, సోమవారం తెప్పోత్సవం నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండం ఏర్పాటు చేశారు. మొక్కుకున్న భక్తులు ఒక్కొక్కరు అగ్నిగుండాని దాటుతున్నారు. ఇంతలో యువతి వంతు వచ్చింది.
అగ్నిగుండంలో పడి
అంతకుముందు వెళ్లిన వారు మెల్లగా దాటుకుంటూ వెళ్లిపోయారు. కానీ యువతి మొదట్లోనే తడబడ్డారు. రెండడుగులు వేసిందో లేదో కుప్పకూలి పడిపోయారు. అయితే అగ్నిగుండం చివరన పడిపోవడంతో ప్రమాదం తప్పింది. అక్కడున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఆమెను అగ్నిగుండం దగ్గరినుంచి తీసుకెళ్లారు. నిప్పురవ్వలు తాకడంతో యువతికి వైద్యం అందించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతికి స్వల్ప గాయాలయ్యాయని, ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఎవరి వాదన వారిది..
సాధారణంగా జాతర సమయంలో అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తుంటారు. తమ నమ్మకంతో అగ్నిగుండం దాటేందుకు భక్తులు ముందుకొస్తుంటారు. కానీ దీనిని జనవిజ్ఞాన వేదిక ఖండిస్తోంది. అలాంటిదేమీ లేదని కొట్టిపారిస్తోంది. కానీ ఇప్పటికీ మారుమూల ప్రాంతాలకు చెందిన ఆలయాల్లో మూఢ విశ్వాసం కొనసాగుతూనే ఉంది. గ్రామస్తుల అభిప్రాయం మేరకు వారికి ఆ సమయంలో రక్షణ కల్పిస్తున్నారే తప్ప.. నిలిపివేసేందుకు చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా ముందడుగు వేయడం లేదు.