Crime News: తేలు కుట్టి యువతి మృతి.. ఆస్పత్రికి తీసుకెళ్లినా నిలవని ప్రాణం..
సాధారణంగా పాము కాటుకు గురై చనిపోతారు. కానీ తేలు కాటుకు గురై చనిపోవడం చాలా అరుదు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి తేలు కుట్టి చనిపోయింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడుకు చెందిన దొంతుల బాలమల్లు-పద్మ దంపతలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కూతురు మాలతి బీటెక్ పూర్తి చేసి ఇటీవలే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సాధించింది.
ఆమె త్వరలో కంపెనీల జాయిన్ కావాల్సి ఉంది. అయితే ఆదివారం తల్లిదండ్రులతో కలిసి తమ పొలం వద్దకు వెళ్లింది. అక్కడ తల్లిదండ్రులతో కలిసి పని చేస్తుండగా.. ఆమెకు తేలు కుట్టింది. ఆమెను వెంటనే సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలించారు. అయితే మాలతి పల్స్ రేటు పడిపోతుండడంతో ఆమెను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
రెండు రోజుల పాటు చికిత్స పొందిన మాలతి పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే సిరిసిల్లలోని ఏరియా ఆస్పత్రి సరిగా చికిత్స అందించలేకపోవడమే కారణమని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.