జగదాంబిక, ఎల్లమ్మ అమ్మవార్లకు తొలిబోనం సమర్పణ, పాల్గొన్న 20 మంది, 27 రోజుల బోనాలు..
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో బోనాల ఉత్సవ శోభ కనిపిస్తుంటుంది. గల్లీలో ప్రతీ ఇల్లు బోనమెత్తడంతో వేడుకగా పండగా సాగేది. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని బోనాల ఉత్సవ లేదు. గోల్కొండ కోట వద్ద గురువారం తొలి బోనం నిరాడంబరంగా ప్రారంభమైంది. వందలాది మందితో కళకళలాడే కోట.. కేవలం 20 మంది కలిసి తొలిబోనాన్ని జగదాంబిక, ఎల్లమ్మ అమ్మవార్లకు సమర్పించారు. తొలిపూజకు అంకురార్పణ జరగగా.. మిగతా ఎనిమిది పూజలు ప్రతీ ఆది, గురువారాల్లో నిర్వహిస్తారు. జూలై 23వ తేదీన అమ్మవార్లకు చివరి పూజ నిర్వహించడంతో భాగ్యనగర బోనాల క్రతువు ముగియనుంది.
తెలంగాణ సంప్రదాయ పండుగ ఆషాఢ బోనాల జాతర
15 నిమిషాల్లోనే..
ఆలయ పూజారులు, దేవదాయశాఖ అధికారులు, కులవృత్తి పనివారు అమ్మవారికి తొలి బోనం సమర్పించగా.. ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున అధికారులు అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఊరేగింపు లేకపోవడంతో చోట బజార్ నుంచి గోల్కొండ కోటకు 15 నిమిషాల్లో అమ్మవారి విగ్రహాలు, తొట్టెలను ట్రాలీ ఆటోలో గోల్కొండ కోటకు తీసుకొచ్చారు. ఇటు పాతబస్తీలో కూడా ఆషాడమాసం బోనాలు మొదలయ్యాయి.
27 రోజులపాటు..
ఈ ఏడాది 27 రోజులపాటు బోనాల జరుగుతాయి. కరోనా వైరస్ వల్ల ప్రతీ రోజు బోనాలు సమర్పించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అంతకుముందు గురువారం, ఆదివారం మాత్రమే బోనాలు సమర్పించేవారు. చాలా మంది రావడంతో పండగ వైభవం కనిపించేది. కానీ వైరస్ వల్ల భౌతిక దూరం పాటించాల్సి వస్తోంది. దీంతో ఎక్కువమంది వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి.. రోజు బోనాలు సమర్పించేందుకు అనుమతిచ్చారు. ఎవరి ఇళ్లలో వారే అమ్మవారికి బోనం సమర్పించాలని అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే.
Recommended Video
నో పర్మిషన్..
మరోవైపు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఊరేగింపును సౌత్ జోన్ పోలీసులు అడ్డుకున్నారు. బంగారు బోనం ఎత్తుకున్న శివసత్తు నిషాక్రాంతి, ఒడిబియ్యం సమర్పించేందుకు మరో మహిళను అనుమతించాలని ఊరేగింపు కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్ పోలీసులను కోరారు. అందుకు అంగీకరించకపోవడంతో గోల్కొండ జగదాంద ఆలయంలో సమర్పించాల్సిన బంగారు బోనం పురానాపూల్ భూలక్ష్మీ ఆలయంలో సమర్పించి... అక్కడినుంచి వెళ్లిపోయారు.