డిఎస్ తనయుడు పక్కా బిజెపి వైపు: కల్వకుంట్ల కవితతో ఢీ?
డి. శ్రీనివాస్ తనయుడు అరవింద్ ధర్మపురి సోషల్ మీడియాలో ఇటీవల సందడి చేస్తున్నారు.ఆయన ప్రధాని నరేంద్ర మోడీని బలపరుస్తూ మరో పోస్టు పెట్టారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తనయుడు అరవింద్ ధర్మపురి సోషల్ మీడియాలో ఇటీవల సందడి చేస్తున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీని బలపరుస్తూ మరో పోస్టు పెట్టారు. ఇది వరకు ఓ పోస్టు ద్వారా మోడీ పట్ల తనకు గల అభిమానాన్ని ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
తాజా పోస్టును బట్టి అరవింద్ ధర్మపురి కచ్చితంగా బిజెపిలో చేరుతారనే సంకేతం ఇచ్చినట్లు అయింది. డిఎస్ కాంగ్రెసులో చేరుతారంటూ ఇటీవల ఓ ప్రచారం జరిగింది. అరవింద్ పోస్టు చూసిన తర్వాత ఆయన కుటుంబమంతా బిజెపిలో చేరుతుందని పుకార్లు షికారు చేశాయి.
అయితే, తాను పార్టీ మారడం లేదని డిఎస్ స్పష్టం చేశారు. తాను తెరాసలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. అయిత, అరవింద్ ధర్మపురి మాత్రం బిజెపిలో చేరి నిజామాబాద్ పార్లమెంటు సీటుకు పోటీ చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తాజా పోస్టు ఇలా...
భారత దేశం దేశభక్తి గల పౌరుడిగా సంపూర్ణమైన హృదయంతో నామోను బలపరుస్తున్నానని మోడీని పటిష్టపరచడం దేశానికి సేవ చేయడంగా భావిస్తానని ఆయన పోస్టు పెట్టారు. దీన్ని బట్టి ఆయన బిజెపిలో చేరడం ఖాయమైపోయినట్లుగా భావిస్తున్నారు. సెప్టెంంబర్లో ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
కవితను ఢీకొంటారా...
సెప్టెంబర్ మొదటి వారంలో అరవింద్ బిజెపిలో చేరి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు జిల్లాలో వినిపిస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు సీటుకు ఇప్పుడు తెరాస తరఫున కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో అరవింద్ కవితను ఢీకొట్టాల్సి ఉంటుంది.
ప్రజల్లో ఉండాలనే...
నిజామాబాద్ జిల్లాలో తండ్రి డిఎస్కు ఉన్న పేరును ఉపయోగించుకొని రాజకీయాల్లోకి రావడానికి అరవింద్ ఆసక్తిగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. డీఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకే పరిమితంఅవుతున్నారు. ఆ ఫ్యామిలీ ప్రజల్లో ఉండేందుకే అరవింద్ పొలిటికల్ ఎంట్రీ అని డీఎస్ వర్గ నాయకులు అంటున్నారు. డిఎస్ మరో కుమారుడు సంజయ్ కూడా బిజెపిలో చేరుతారా అనే సందేహాలు పొడసూపుతున్నాయి.
డిఎస్ తెరాసలో ఉంటారా..
డీఎస్ తెరాసలో కొనసాగుతారా? లేదంటే ఆయన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? అనేదానిపై ఏ విధమైన స్పష్టత లేదు. నిజామాబాద్ జిల్లా నుంచి బడా లీడర్లు త్వరలోనే తమ పార్టీలో చేరుతారని బిజెపి నాయకులు అంటున్నారు. జిల్లాలోని పలువురు సీనియర్ నేతలు తమను సంప్రదిస్తున్నట్లు జిల్లాకు వచ్చిన సందర్భంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా అన్నారు.