'60 ఏళ్ల దారిద్య్రం 18 నెలల్లో పోతుందా?': గ్రేటర్ ప్రచారంలో బాబూమోహన్
హైదరాబాద్: ప్రజల సంక్షేమం దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూ మోహన్ అన్నారు. శుక్రవారం పటాన్ చెరులో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన బాబూ మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు కేసీఆర్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు ఏమీ కావాలో వాటిని నెరవేర్చే దిశగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు.
అభివృద్ధిలో భాగస్వాములవుదాం: మంత్రి తుమ్మల
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించి, అభివృద్ధిలో భాగస్వాములవుదామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. చందానగర్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్లు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంటి పార్టీని గెలిపించుకుని విపక్షాలకు బుద్ధి చెప్పాలని సూచించారు. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.
అందరినీ సమానంగా చూస్తున్నాం: కేటీఆర్
హైదరాబాద్లో ఉన్న వారందరిని సమానంగా చూస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. చందానగర్లో నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు మద్దతు పలకాలన్నారు. హైదరాబాద్లో కరెంట్, నీటి బకాయిలు మాఫీ చేశామన్నారు.
60 ఏళ్లలో టీడీపీ, కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు. 60 ఏళ్ల దారిద్య్రం 18 నెలల్లో పోతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే అంధకారమవుతుందని కొందరు విమర్శించారన్నారు. రాష్ట్రంలో రెప్పపాటు కోత లేకుండా కరెంట్ను సరఫరా చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు.