2017 ఇయర్ రౌండప్: రేవంత్ ఎఫెక్ట్ బిజెపికి దెబ్బ, అమిత్షాపైనే ఆశలు
హైదరాబాద్: బిజెపికి 2017 పెద్దగా కలిసి రాలేదు. ఈ ఏడాదిలో తెలంగాణలో బలోపేతమయ్యేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలు అంతగా ఫలితాలను ఇవ్వలేదు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండురోజుల పర్యటనతో తెలంగాణలో ప్రభావం చూపించే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఆ పార్టీ ప్రయత్నాలు చేసింది. కానీ, ఆచరణలో మాత్రం ఆ పార్టీకి కలిసివచ్చినట్టు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ బిజెపికి పరోక్షంగా దెబ్బపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రేవంత్ దెబ్బ: టిడిపికి అచ్చిరాని 2017, వ్యూహత్మక తప్పిదాలు
2019 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకొంది. తెలంగాణ జిల్లాల పర్యటనకు వచ్చిన సందర్భంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
ఏపీ రాష్ట్రంలో 2019 వరకు టిడిపితో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో పొత్తు ఉంటుందా లేదా అనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.అయితే ఏపీ రాష్ట్రంలో ఇప్పటికే టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.
2017 రౌండప్: కాంగ్రెస్కు కలిసొచ్చింది, బాబుకు రేవంత్ దెబ్బ, టిఆర్ఎస్ చెక్ పెట్టే ప్లాన్ ఇదే
బిజెపికి కలిసిరాని 2017
బిజెపికి 2017 సంవత్సరం ఆశించిన మేర కలిసి రాలేదు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున తమ పార్టీలోకి వలసలు వస్తాయని బిజెపి నాయకత్వం భావించింది. కానీ, బిజెపి నేతలు ఆశించినట్టుగా కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు రాలేదు. కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను బిజెపిలో చేర్చేందుకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇచ్చినట్టు లేదు. బిజెపి కేంద్ర నాయకత్వం ఈ మేరకు కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించినట్టు కూడ వార్తలొచ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో ఎవరూ కూడ చేరలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో బలపడేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.
తెలంగాణకు కోల్పోయిన ప్రాతినిథ్యం
కేంద్ర మంత్రి వర్గం నుండి బండారు దత్తాత్రేయ ఈ ఏడాదే ప్రాతినిధ్యం కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బండారు దత్తాత్రేయ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మోడీ కేబినెట్లో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల కాలంలో మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు. అయితే ఈ క్రమంలో మోడీ కేబినేట్ నుండి దత్తాత్రేయకు ఉద్వాసన పలికారు. పార్టీ అవసరాల రీత్యానే చాలా రాష్ట్రాల్లో మోడీ మంత్రివర్గం నుండి పార్టీ నేతలను తప్పించారు.
బిజెపిని పరోక్షంగా దెబ్బ కొట్టిన రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలకనేతలతో బిజెపి నాయకులు చర్చలు జరుపుతున్నారని చర్చ ప్రచారం సాగింది. కానీ, ఆ తర్వాత టిడిపి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి టిడిపిని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వెంట టిడిపికి చెందిన సుమారు 16 మంది కీలక నేతలు కూడ ఉన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. అయితే అదే సమయంలో ఈ పరిణామం బిజెపికి తీవ్రంగా నష్టం చేసింది. రేవంత్తో పాటు టిడిపి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బిజెపిలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేరుతారనే ప్రచారం ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే మరోసారి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా రాష్ట్ర పర్యటనపై బిజెపి నేతలు ఆశలు పెట్టుకొన్నారు.
నేతల మధ్య సమన్వయం లేదు
బిజెపి నేతల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధానంగా ఇబ్బంది కల్గిస్తోందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. బిజెపి శాసనసభపక్షనేత కిషన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాజాసింగ్కు మద్య విబేధాలున్నాయి. ఈ ఇద్దరి నేతల వ్యవహరం బహిరంగ రహస్యమే. పార్టీ సినియర్ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డికి పార్టీ నేతలకు మధ్య కొంత సమన్వయం లేదనే ప్రచారం కూడ ఉంది. రాష్ట్ర నాయకుల వ్యవహరశైలితో నాగం కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.పార్టీ విస్తరణకు నేతల మధ్య సమన్వయం లేకపోవడం కూడ అడ్డంకిగా ఉందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
టిఆర్ఎస్ పై బిజెపి ఇలా.
టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బిజెపి నేతలు ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తారు. కానీ,కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న కొన్ని కార్యక్రమాలను టిఆర్ఎస్ మద్దతివ్వడం ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు.టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలను కేంద్ర మంత్రులు బహిరంగంగానే ప్రశంసించడం కూడ బిజెపి నేతలకు రాజకీయంగా ఇబ్బందికల్గించిన ఘటనలు కూడ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.