కీలక మలుపు: ఆడియో టేపుల్లోని వాయిస్ రేవంత్, సండ్రలవేనని నిర్ధారణ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు రూ. 50 లక్షలు ముట్టచెబుతూ టీటీడీపీ ఉపనేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏసీబీకి దొరికిన సంగతి తెలిసిందే.
స్టీఫెన్ సన్ ఇంట్లోనే రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఓటుకు నోటు కేసుతో మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా సంబంధాలున్నాయనే కారణంతో ఆయన్ని కూడా ఏబీసీ అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత వీరిద్దరూ బెయిల్పై విడుదలై ప్రస్తుతం బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలుగా సేకరించిన ఆడియో టేపుల్లోని వాయిస్లను నిర్ధారించుకునేందుకు వాటిని ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ ఆడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు గురువారం తమ నివేదికను ఏసీబీ అధికారులకు అందజేశారు.
ఆడియో టేపుల్లోని వాయిస్ లు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన జెరూసలెం మత్తయ్యలవేనని తేలినట్లు సమాచారం. ఇక వీడియో టేపులను కూడా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు వాటిలోని వాయిస్లు కూడా నిందితులవేనని నిర్ధారించానట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసు దర్యాప్తులో కీలక సాక్ష్యాలుగా పరిగణిస్తున్న ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ పూర్తి అయిన నేపథ్యంలో ఈ కేసులో అదనపు చార్జీ షీట్ దాఖలుకు ఏసీబీ సమాయత్తమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.