భర్త గురించి వస్తే: మహిళపట్ల ఎస్సై అసభ్యంగా, కూతురుపైనా, అరెస్ట్
హైదరాబాద్: మహిళల రక్షణ కల్పించాల్సిన షీ టీం సభ్యుడే ఓ స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్టైన సంఘటన భాగ్యనగరంలో జరిగింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఎస్సై సతీష్ పైన పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఎస్సై సతీష్ కొంత కాలంగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతనిపై నిఘా ఉంచిన ఉన్నతాధికారులు, మహిళ ఫిర్యాదు నిజమేనని నిర్ధారించుకున్నారు. దీంతో అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
బాధిత మహిళ భర్త అదృశ్యమయ్యాడని ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్కు వెళ్లింది. సదరు ఎస్సై స్థానిక షీ బృందంలో సభ్యుడు కూడా కావడం గమనార్హం. అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్కు చెందిన లక్ష్మీ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నెల రోజుల క్రితం మహారాష్ట్రలోని షిర్డీకి వెళ్లారు. తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఆమె భర్త రైలు దిగి రాలేదు. ఇంటికి చేరుకున్న లక్ష్మీ మేడ్చల్ పోలీసుస్టేషన్లో తన భర్త అదృశ్యమయ్యాడని కేసు పెట్టింది.
కేసు దర్యాఫ్తు బాధ్యతను పోలీసులు నేర విభాగం ఎస్సై సతీష్కు అప్పగించారు. విచారణలో భాగంగా మేడ్చల్ ఠాణాకు పిలిపించిన అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించారు. సెల్ ఫోన్లో ఎస్సై వేధిస్తుండగా సంభాషణలను రికార్డ్ చేసి, పేట్ బషీరాబాద్ ఎస్పికి వినిపించారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వాపోయారు. సతీష్ తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడేవారని, అతని ఫోన్ వచ్చిందంటే భయంతో చెమటలు పట్టేవని అన్నారు. సతీష్ను చర్లపల్లి జైలుకు తరలించారు.