Bharat Biotech భద్రత మొత్తం సీఐఎస్ఎఫ్ బలగాల చేతుల్లో: ఆ బాధ్యతను తప్పించిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. కోవాగ్జిన్ సృష్టికర్తగా గుర్తింపు పొందిన ఈ ఫార్మా కంపెనీ సెక్యూరిటీ వ్యవహారాలన్నింటినీ కేంద్రీయ పారిశ్రామిక బలగాల (సీఐఎస్ఎఫ్) చేతికి అప్పగించింది. ఈ ఉదయమే సీఐఎస్ఎఫ్ బలగాలు విధుల్లోకి దిగాయి. ఈ కంపెనీ భద్రతపరమైన అంశాలన్నీ యాజమాన్యం ఆధీనంలో గానీ.. తెలంగాణ పోలీసుల చేతుల్లో గానీ ఉండదు.
దేశంలో మళ్లీ మొదటికొచ్చిన కరోనా మరణాలు: నాలుగు వేలకు టచ్: అదొక్కటే ఊరట
భారత్ బయోటెక్ క్యాంపస్.. హైదరాబాద్ శివార్లలోని షామీర్పేట్ సమీపంలో గల తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ సెక్యూరిటీ వ్యవహారాలన్నీ ఆ సంస్థ యాజమాన్యమే చూసుకుంటోంది. కోవాగ్జిన్ను అభివృద్ధి చేసిన తరువాత.. ఈ సంస్థ భధ్రత వ్యవహారాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ బాధ్యతను కేంద్రీయ పారిశ్రామిక బలగాల (సీఐఎస్ఎఫ్) చేతికి అప్పగించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే సెక్యూరిటీ వింగ్ ఇది.
కేంద్రం ఆదేశాలతో సీఐఎస్ఎఫ్ ఈ దిశగా చర్యలు తీసుకుంది కూడా. ఈ ఉదయమే అక్కడి సెక్యూరిటీని స్వాధీన పరచుకుంది. ఇన్సెక్టర్ స్థాయి అధికారి భారత బయోటెక్ క్యాంపస్ భద్రతను పర్యవేక్షిస్తారు. మొత్తం 64 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు క్యాంపస్కు రేయింబవళ్లు పహారా కాస్తారు. రొటేషన్ పద్ధతిన రౌండ్ ద క్లాక్ ఈ క్యాంపస్ మొత్తం వారి ఆధీనంలోనే ఉంటుంది. దీనిపై ఆ కంపెనీ ప్రైవేటు సెక్యూరిటీకి గానీ, తెలంగాణ పోలీసులకు గానీ ఎలాంటి పర్యవేక్షణాధికారాలు ఉండబోవు.
పరిశ్రమలకు భద్రతను కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం..సీఐఎస్ఎఫ్. 1969లో ఇది ఏర్పాటైంది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు.. ఢిల్లీ మెట్రో భద్రతా వ్యవస్థలు కూడా ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలోనే ఉన్నాయి. నవరత్న హోదా ఉన్న దేశీయ పరిశ్రమల భద్రతను పర్యవేక్షించడానికి దీన్ని నెలకొల్పారు. అలాంటి ప్రతిష్ఠాత్మక భద్రతా విభాగం సీఐఎస్ఎఫ్ చేతికి భారత్ బయోటెక్ సెక్యూరిటీ వ్యవహారాలన్నీ వెళ్లడం చర్చనీయాంశమౌతోంది.