ఎస్సై ఉద్యోగాల రేసులో టెక్కీలు, లక్షలో ఇరవై వేలు వారివే
హైదరాబాద్: ఇరవై అయిదు వేల మందికి పైగా టెక్కీలు లేదా ఇంజినీరింగ్ విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే సేఫ్ జాబ్ అని చాలామంది భావిస్తారు.
ఎస్సై ఉద్యోగాల కోసం డిగ్రీ కనీస అర్హత. ఇటీవల ఎస్సై ఉద్యోగాల కోసం తెలంగాణలో నోటిఫికేషన్ విడుదల చేశారు. 26వేల మందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎస్సై ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయిది వందల ఉద్యోగాలు పడ్డాయి.
ఎస్సైకి స్టార్టింగ్ శాలరీ రూ.30వేలకు పైగా ఉంటుంది. ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వ్ చేశారు. లక్షకు పైగా వచ్చిన దరఖాస్తుల్లో టెక్కీలు కూడా పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు. 24కు పైగా బిటెక్ గ్రాడ్యుయేట్లు, రెండువేలకు పైగా ఎంటెక్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారట. దరఖాస్తు చేసుకున్న వారిలో 22వేలకు పైగా బిఎస్సీ గ్రాడ్యుయేట్లు, నాలుగువేలకు పైగా మాస్టర్ ఆఫ్ సైన్స్కు చెందిన వారు ఉన్నారు. పదహారు దరఖాస్తులు ఎంఫిల్ డిగ్రీవి ఉన్నాయి.
కాగా, దరఖాస్తు తేదీ అయిపోయింది. మార్చి 3 దరఖాస్తుకు చివరి తేదీ. 510 ఉద్యోగాలు ఉంటే లక్షకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమినరీ రాత పరీక్ష ఏప్రిల్ 17వ తేదీన జరగనుంది.