ఐబీఎస్ ర్యాగింగ్ కేసు: ఐదుగురు విద్యార్థుల అరెస్ట్, మరో ఐదుగురి కోసం గాలింపు
హైదరాబాద్: మరోసారి రాగింగ్ భూతం కలకలం రేపుతోంది. తాజాగా, శంకరపల్లి ఇండియన్ బిజినెస్ స్కూల్లో ర్యాగింగ్కు సంబంధించిన కేసులు పోలీసులు ఐదుగురుని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు కోసం గాలిస్తున్నారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు శంకర్పల్లి పోలీసులు.
నిందిత విద్యార్థులపై సెక్షన్ 307, 323, 450, 342, 506 రెడ్విత్ 149 ఐపీసీ 4(I), 4 (Ii), 4(Iii) ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ర్యాగింగ్ వ్యవహారంలో యాజమాన్య నిర్లక్ష్యం కింద కళాశాలపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ర్యాగింగ్కు పాల్పడిన పదిమంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శంకర్పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని ప్రతిష్టాత్మక ఐబీపీఎస్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో ఓ విద్యార్ధిని.. చితకబాదారు. ఓ విద్యార్థిని రూమ్లో బంధించి.. కొందరు సీనియర్ విద్యార్థులు తీవ్రంగా హింసించారు.
పిడిగుద్దులు గుద్దుతూ.. తీవ్రంగా గాయపర్చారు. ముఖం మీద పౌడర్ చల్లి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత దాడి చేసిన విద్యార్ధులపై మరో వర్గం దాడి చేసింది. ఈ ర్యాగింగ్ విషయం పోలీస్ స్టేషన్కు చేరడంతో.. ఇరు వర్గాలను మందలించి పంపించారు. తీవ్రంగా కొట్టిన దెబ్బలకు తాళలేక బాధిత విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బెంబేలెత్తిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు క్యాంపస్ నుంచి తమ కొడుకుని తీసుకెళ్ళిపోయారు.
తనకు జరిగిన అన్యాయంపై బాధిత విద్యార్థి ఐటీ శాఖా మంత్రి కేటీఆర్కి ఫిర్యాదు చేయడంతో ర్యాగింగ్ రచ్చ బయటకొచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్ ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.