పవన్ కంటే ముద్రగడకే ఫాలోయింగ్, వైఎస్ఆర్ కోసం రాజీవ్ను ఒప్పించా: వి.హెచ్.సంచలనం
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు తెలంగాణ సీఎం కెసిఆర్ గాలం వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. తెలంగాణలో కాపుల ఓట్ల కోసమే కెసిఆర్ పవన్ కళ్యాణ్తో వల వేస్తున్నారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు.
Recommended Video

గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్, కెసిఆర్ లు ఒకరిపై మరోకరు ఆరోపణలు, విమర్శలు చేసుకొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఒకరికొకరు ఎందుకు ప్రశంసలు గుప్పించుకొంటున్నారో అర్ధం కావడం లేదని విహెచ్ అన్నారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో రాజ్ భవన్లో కెసిఆర్ మాట్లాడిన సమయంలోనే తనకు అనుమానం వచ్చిందని విహెచ్ చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో విహెచ్ పలు విషయాలపై మాట్లాడారు.

కాపుల ఓట్ల కోసమే కెసిఆర్ పవన్ కళ్యాణ్ వల
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాపుల ఓట్ల కోసం సీఎం కెసిఆర్ పవన్ కళ్యాణ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విహెచ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమా నటుడైనందును సినీ గ్లామర్ తమ పార్టీకి ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశం ఉందని కెసిఆర్ విశ్వసిస్తున్నారని విహెచ్ అనుమానించారు. ఈ కారణం చేతనే పవన్ కళ్యాణ్కు కెసిఆర్ వల వేస్తున్నారని విహెచ్ అభిప్రాయపడ్డారు.

ముద్రగడ పద్మనాభానికే ఫాలోయింగ్ ఎక్కువ
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఏపీ రాష్ట్రంలో ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం అంటేనే జనం విశ్వసించే అవకాశం ఉందని విహెచ్ అభిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ చిరంజీవి సోదరుడిగా తనకు తెలుసునని విహెచ్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో బాబు గెలుపు
పవన్ కళ్యాణ్ వల్లే ఏపీ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అధికారాన్ని కైవసం చేసుకొన్నారని వి . హనుమంతరావు అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణలో కూడ కాపు ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు కెసిఆర్ పవన్ కళ్యాణ్తో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తున్నారని విహెచ్ చెప్పారు.

పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా సహకరిస్తా
పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను సహకరిస్తానని వి.హనుమంతరావు చెప్పారు.తనకు పీసీసీ చీఫ్ పదవి కావాలనే కోరిక లేదన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి గ్రామంలో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ చైర్మెన్ పదవిని ఇవ్వాలని కోరుకొంటున్నట్టు వి.హనుమంతరావు చెప్పారు.కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సమన్వయం ఉందన్నారు.

సీఎం పదవిని సీనియర్లు అడ్డుకొన్నారు
తనకు 40 ఏళ్ళ వయస్సులో రాజీవ్గాంధీ ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని చూశారని వి. హనుమంతరావు గుర్తు చేసుకొన్నారు. కానీ, ఆనాడు పార్టీలోని సీనియర్లు తనకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేసి సీఎం కాకుండా అడ్డుకొన్నారని వి. హనుమంతరావు చెప్పారు.కానీ, ముఖ్యమంత్రి అవుతానని ఇక తనకు ఆశ లేదన్నారు.

బీసీ ముఖ్యమంత్రి కావాలి
తెలంగాణ రాష్ట్రానికి బీసీ నేత ముఖ్యమంత్రి కావాలని వి.హనుమంతరావు ఆకాంక్షను వ్యక్తం చేశారు. తాను అగ్రవర్ణాలకు వ్యతిరేకమనే ప్రచారం చేశారని చెప్పారు.కానీ తాను అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదన్నారు.












Click it and Unblock the Notifications