ప్రొటోకాల్ రగడ: కయ్యిమన్న ఎమ్మెల్యే.. బుస్సుమన్న కలెక్టర్
‘ఏయ్ కలెక్టర్.. ఏమిటిది?’ అంటూ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిలదీస్తే... ‘డోంట్ టాక్..’ అంటూ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గద్దించారు.
కరీంనగర్: ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు కలెక్టర్. ప్రజాసేవకులైన వారే ప్రజల ఎదుట పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, ఈటల రాజేందర్ ల సాక్షిగా వాగ్వాదానికి దిగారు.
'ఏయ్ కలెక్టర్.. ఏమిటిది?' అంటూ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిలదీస్తే... 'డోంట్ టాక్..' అంటూ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గద్దించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం డిజి ధన్ మేళా కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో ప్రొటోకాల్ విషయమై ఈ రగడ రేగింది.
వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్ లో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రులు ఈటల, కేటీఆర్ పొటోలు మాత్రమే ముద్రించారు. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫొటోలు ముద్రించకపోవడం వివాదానికి దారితీసింది.
ప్రజాప్రతినిధులంటే కలెక్టర్ కు గౌరవం లేదంటూ రసమయి బాలకిషన్ విసవిసలాడారు. ఫ్లెక్సీలో ఫొటో చేర్చండి.. లేదా ఫ్లెక్సీని మార్చండి అంటూ ఎమ్మెల్యేలు రసమయి, గంగుల కమలాకర్ లు కలెక్టర్ తీరుపై మండిపడ్డారు.
అయితే ఎంపీ, మంత్రి జోక్యం చేసుకుని మరోసారి వారిని వేదికపైకి ఆహ్వానించడంతో కమలాకర్ వేదికపైకి వెళ్లారు. కాగా, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే డిజి ధన్ మేళా ఏర్పాట్లు జరిగాయని, ప్రొటోకాల్ కూడా వారి సూచనల మేరకే పాటించామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు.