కెసిఆర్‌కు సవాలే మరి: అధికారాలుండవ్ సరే! వాటికి రుణ పరపతి ఎలా?

అన్నదాతల అభ్యున్నతి కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటిస్తున్నారు. అందుకోసమే గ్రామ స్థాయి నుంచి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు.

హైదరాబాద్: అన్నదాతల అభ్యున్నతి కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటిస్తున్నారు. అందుకోసమే గ్రామ స్థాయి నుంచి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రెండు సీజన్లకు ఎకరాకు రూ.4000 చొప్పున నగదు సాయం అందజేస్తామని ప్రకటించారు.
కానీ దీనికి ప్రాతిపదిక ఏమిటన్నది? సీఎం కేసీఆర్ మనో ఫలకంపై ఉన్న విషయమేమిటో అమలులోకి వస్తే గానీ తెలియని పరిస్థితి నెలకొన్నది. అన్నదాత అభ్యున్నతి కోసం పారదర్శకంగా, నిజాయితీగా పనిచేసే పాలకులకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఆ విషయం సీఎం కేసీఆర్‌కు కూడా తెలుసు.

ఇప్పటివరకు రైతులు, గ్రామీణులకు అండగా నిలిచిన వారికే మద్దతు లభించింది. రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలోనే గిట్టుబాటు ధర, పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరా, పండించిన పంటలకు అవసరమైతే సరైన ధర కోసం గోడౌన్లలో దాచుకునేందుకు వెసులు బాటు కల్పించనున్నట్లు చెప్పారు. అయితే అధికారాలు లేని ఈ సమన్వయ సమితులను ప్రభుత్వానికి ఎలా అనుసంధానిస్తారన్న విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

 త్వరలో అధికారులతో భేటీ కానున్న సీఎం కేసీఆర్

త్వరలో అధికారులతో భేటీ కానున్న సీఎం కేసీఆర్

ప్రభుత్వంతో రైతు సమన్వయ సమితులను సంధానించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ త్వరలో అధికారులతో త్వరలో ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. ఇందులో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు ఉండనున్నట్లు సమాచారం. రూ. 500 కోట్లు మార్కెట్ నిధి ఇస్తే ఎవరి ద్వారా వినియోగించాలనే విషయమై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రైతు సమన్వయ సమితి ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నది. తాము తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రూ.500 కోట్ల నిధులు విడుదల చేయరాదని, అసలు రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై మీ వైఖరేమిటో మూడు వారాల్లో తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

చట్టబద్ధం కాకుంటే తలెత్తే సవాళ్లివి..

చట్టబద్ధం కాకుంటే తలెత్తే సవాళ్లివి..

గతంలో పాలమూరు - రంగారెడ్డి మొదలు మల్లన్న సాగర్, కాళేశ్వరం, సుందిళ్ల తదితర సాగునీటి ప్రాజెక్టులు ప్లస్ సింగరేణిలో వారసత్వ ఉద్యోగ నియామకాల విషయమై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తప్పుబట్టడమే కాదు వాటిని అసలు అమలు చేయొద్దన్నది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం చట్టం కావాలే తప్ప జీవోలతో పనులు పూర్తి చేయడం అక్రమమమని తేల్చేయడంతో ప్రభుత్వానికి తలబొప్పి కట్టింది.

ఇప్పుడు కూడా ఒకవేళ హైకోర్టు నిధులు కేటాయించడాన్ని నిరాకరిస్తే ఏం చేయాలి, కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక శాఖ పరిధిలో ఉంచితే ఎలా ఉంటుందన్న విషయమై కూడా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించాల్సి ఉంటుంది. అదే జరిగితే చట్టబద్ధంగా నియామకాలు జరుపలేదన్న అంశం న్యాయస్థానంలో చర్చకు వస్తుంది. అదే జరిగితే అసంబద్ధమైన పరిస్థితులు నెలకొంటాయి. చట్టబద్ధంగా సమితుల నియామకం జరుగలేదని విపక్షాలు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 సమగ్ర కుటుంబ సర్వే సమయంలో సర్కార్ వాదన ఇలా

సమగ్ర కుటుంబ సర్వే సమయంలో సర్కార్ వాదన ఇలా

మరోవైపు కోర్టులో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవడానికే రైతు సమితులకు అధికారాలు ఉండవని, ఇతరుల హక్కులను హరించబోవని దాట వేత వ్యూహం అమలు చేసేందుకు పూనుకున్నందునే సీఎం కేసీఆర్ గతానికంటే భిన్నంగా ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో ‘సమగ్ర కుటుంబ సర్వే' పేరిట అన్ని జిల్లాల్లో ఒకేరోజు సర్వే పూర్తి చేశారు.

దానిపై కొందరు న్యాయస్థానానికి వెళితే ఇది కేవలం ఐచ్ఛికమేనన్న అభిప్రాయాన్ని న్యాయస్థానం ద్రుష్టికి తీసుకెళ్లి.. సర్వే నిర్వహణకు ఆటంకాలు లేకుండా చేయగలిగారు. కానీ రైతు సమన్వయ సమితుల వ్యవహారం ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్నది. ఆదివారం ప్రగతి భవన్‌లో నల్లగొండ - రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి దారుల సంఘం సభ్యులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మరో మాట చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులతో తెలంగాణ సబ్బండ వర్ణాలకు చెందిన రైతుల రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. ఈ సమితులకు అధికారం ఉండదంటూనే బ్యాంకుల నుంచి రూ.4000 కోట్ల రుణ పరపతి లభిస్తుందన్ని మరో ఆకర్షణీయమైన ప్రకటన చేశారు.

సెర్ప్, మహిళా సంఘాల కార్యకలాపాలు ఇలా

సెర్ప్, మహిళా సంఘాల కార్యకలాపాలు ఇలా

రైతు సమన్వయ సమితులకు చట్టబద్ధమైన అధికారాలు కల్పించకుండా బ్యాంకుల నుంచి రుణాలు పొందే వెసులుబాటు ఎలా కల్పిస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ అందుబాటులో ఉన్నది. తెలంగాణలోనూ డీసీసీబీ బ్యాంకులు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు పని చేస్తున్నాయి. ఈ బ్యాంకుల నుంచి కూడా రైతులు రుణాలు పొందేందుకు వీలు కలుగుతున్నది. అయితే సహకార వ్యవస్థ ఏర్పాటుకు చట్టం ఉన్నది. ఇక చంద్రబాబు హయాంలో ఏర్పాటైన ‘సెర్ప్', మహిళా స్వయం సహాయ (డ్వాక్రా) సంఘాల ఏర్పాటు కోసం కూడా ప్రత్యేక చట్టాలు ఏర్పాటయ్యాయి. మహిళా స్వయం సహాయ సంఘాలు.. సెర్ప్ తదితర సంస్థలతో కలిపి బ్యాంకు నిర్వహిస్తున్నాయి.

ఇటువంటి ఏర్పాట్లేమీ లేకుండానే రైతు సమన్వయ సమితుల ద్వారా రైతులకు మేలు ఎలా చేస్తారన్నది ఎవరికీ అంతుబట్టని వ్యవహారంగా మిగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ రైతు సమన్వయ సమితులకు విభిన్న కోణంలో నిధులు కేటాయించినా.. ఆ విధానం అమలు తీరు వెల్లడించకున్నా.. కూపీ లాగేందుకు న్యాయస్థానానికి విపక్షాలు తప్పక వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పారదర్శకంగా వ్యవహరించినంత వరకు మాత్రమే న్యాయస్థానాలు ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రశ్నించవు. కానీ పరిస్థితి తారుమారైతే.. మొత్తం పనితీరును సమీక్షించడంతోపాటు విధాన నిర్ణయాలను తిరుగదోడేందుకు వెనుకాడవన్న సంగతి పాలకులకు కూడా తెలుసు.

 జోరుగా మంత్రుల మంత్రాంగం ఇలా..

జోరుగా మంత్రుల మంత్రాంగం ఇలా..

ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల పర్యవేక్షణలో జరిగిన రైతు సమన్వయ సమితిల ఎంపిక ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో సత్సంబంధాలు గల నేతలకే ఈ సమితిలో చోటు దక్కిందంటే అతిశేయోక్తి కాదు. రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితిలో చోటు కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారు. రైతు సమన్వయ సమితికి రూ. 500 కోట్ల నిధి కేటాయింపుతోపాటు, రాష్ట్ర సమితిలో సభ్యులుగా 42 మందికే అవకాశం ఉన్నది. ఇది కూడా నేతల మధ్య తీవ్రమైన పోటీకి కారణభూతమవుతున్నది. దీంతో మంత్రులు జిల్లాల వారీగా రంగంలో దిగి తమ వంతు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. జిల్లాకొక్క స్థానమే లభించే అవకాశం ఉండడంతో తమ వారికి అవకాశం కల్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.

ఇన్ చార్జి మంత్రులకు ఇలా ఒత్తిళ్ల పొత్తిళ్లు..

ఇన్ చార్జి మంత్రులకు ఇలా ఒత్తిళ్ల పొత్తిళ్లు..

కొంత మంది ప్రజాప్రతినిధులు భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తమ వారసులు, బంధువులకు అవకాశం కోసం పైరవీ చేస్తున్నారు. రాష్ట్ర రైతు సమితి చైర్మన్‌గా - నల్లగొండకు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డికే దక్కనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన తన సొంత ఊరు ఉరుమడ్ల నుండి ఇప్పటికే స్థానిక రైతు సమితిలో సభ్యత్వం పొందారు. అంతే కా కుండా పలువురు ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు కూడా కొన్నిచోట్ల రైతు సమితులలో సభ్యులుగా చేరారు. టిడిపి నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన ఒక సీనియర్ ఎంఎల్‌ఎ కూడా రాష్ట్ర సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్ర సమితి లో వివక్ష లేదని చెప్పుకునేందుకు మెజారిటీ స‌భ్యులు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నా, కొంత మంది ఇతర పార్టీలు, రైతు సంఘాల వాళ్ళకు కూడా చోటు కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరో మూడు రోజుల్లో మండల స్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు పూర్తి కానున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియలో సభ్యత్వానికి, కో ఆర్డినేటర్ పోస్టుల ఎంపిక ప్రక్రియలోనే ఇన్ చార్జీ మంత్రులు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మంత్రులు పలుమార్లు సమితుల సభ్యుల పేరు మార్పును సూచించాల్సి వస్తోంది.

మండల స్థాయి పూర్తయ్యాకే జిల్లా సమితుల ఏర్పాటుపై సర్కార్ నజర్

మండల స్థాయి పూర్తయ్యాకే జిల్లా సమితుల ఏర్పాటుపై సర్కార్ నజర్

ఇప్పటి వరకు 332 మండలాలకు రైతు సమితులు ఏర్పాటైనట్లు తెలిసింది. మొత్తం 559 మండలాల్లోని 10,733 గ్రామాల సమితుల ఏర్పాటుకు మరో రెండు, మూడు రోజులు సమయం పట్టే అవకాశం వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇవి పూర్తయ్యాకే జిల్లా సమితులను ఏర్పాటు చేస్తారు. జిల్లా సమితుల ఎంపికపై మంత్రులతో సీఎం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక రైతు సమితులలో సభ్యత్వం తీసుకోవాలంటే ఖచ్చితంగా సాగు భూమి ఉండి, అదే గ్రామం వారై ఉండాలి. అయితే కొన్నిజిల్లాలో భూమి లేని వారిని సభ్యులుగా ఎంపిక చేసినట్లు తెలిసింది. అటువంటి వాటిని గమనిస్తున్న కొన్ని జిల్లాల కలెక్టర్లు జాబితాను మంత్రికి తిరిగి పంపుతున్నారు. వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+