బాహుబలికి వ్యతిరేకంగా ధర్నా: 'కటిక చీకటి' తొలగించాలని రాజమౌళికి హెచ్చరిక
బాహుబలి 2పై ఆరెకటిక కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా హైదరాబాదులో భారీ ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్: బాహుబలి 2పై ఆరెకటిక కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా హైదరాబాదులో భారీ ధర్నా నిర్వహించారు.
బాహుబలి 2 సినిమా రికార్డులు సృష్టిస్తుంది. దీంతో పాటే చిన్న చిన్న వివాదాలు కూడా చుట్టుకుంటున్నాయి. సోమవారం హైదరాబాద్లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట ఆరె కటిక సంఘాలు ధర్నా నిర్వహించాయి.
బాహుబలి 2లో తమ కులాన్ని కించపరిచేలా ఉన్న సీన్లను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేసారు. ఆరెకటిక పోరాట సమితి అధ్యక్షులు సుధాకర్ సహా పలువురు నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.
ఈ పదాలతో ఆత్మగౌరవం దెబ్బతీశారు
శుక్రవారం విడుదలైన బాహుబలి 2 సినిమాలో తమ కులాన్ని కించపరిచేలా కటిక చీకటి, కసాయి అనే పదాలను వాడారని, అది ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరె కటిక సమితి ఆరోపించింది.
క్రిమినల్ కేసులు పెట్టాలి
దీనికి బాధ్యులైన దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదివారమే వారు పోలీసులను ఆశ్రయించారు. దర్శక, నిర్మాతలపై సుధాకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రాజమౌళికి హెచ్చరిక
బాహుబలి2 నుంచి కటిక చీకటి అనే పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే దర్శకుడు రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అప్పటికీ మార్పు రాకుంటే థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామన్నారు.
నిన్న కట్టప్పపై కన్నడిగులు..
ఇంతకుముందు, కర్నాటకలో సత్యరాజ్ (సినిమాలో కట్టప్ప పాత్ర) క్షమాపణ చెప్పే వరకు తగ్గేది లేదని కన్నడ సంఘాలు సినిమా విడుదలకు ముందు డిమాండ్ చేశాయి. దీంతో ఆయన తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు.
తాజాగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా వదలలేదు. ఆయన అధిక ధర చెల్లించి టికెట్ కొని బాహుబలి - 2 సినిమా చూశారు. ఫ్యామిలీతో ఆయన ఈ సినిమా చూశారు. ఇందుకోసం ఆయన ఒక్కో టిక్కెట్కు రూ.వెయ్యికి పైగా చెల్లించారు. ఇది వివాదమైంది.