నయీం కేసులో కీలక మలుపు, సంచలనం: టిఆర్ఎస్ నేతలు, అధికారుల పేర్లు!
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు కీలక మలుపు తిరుగుతోంది. నయీం కేసులో పలువురు పోలీసులు, నేతల పేర్లు తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పలువురి వాంగ్మూలం ఆధారంగా నయీంతో సంబంధం ఉన్న అధికారుల పేర్లను ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) కోర్టుకు మంగళవారం నాడు అందించింది.
నయీం బినామీలుగా పలువురు ఉన్నట్లుగా పలువురు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇద్దరు తెరాస నాయకుల పేర్లు వాంగ్మూలం ఇచ్చిన వారు ప్రస్తావించినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
నయీం బినామీలుగా పోలీసులు అధికారులు సాయి మనోహర్, మద్దిపాటి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకరి వాంగ్మూలంలో ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర రావు, మరొకరి వాంగ్మూలంలో చింతల వెంకటేశ్వర రెడ్డి, ఇంకొకరి వాంగ్మూలంలో మద్దిపాటి శ్రీనివాస్, మరో వాంగ్మూలంలో వెంకట్ రెడ్డి పేరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
నల్గొండ జిల్లాకు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా బయటకు రావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు నయీంతో తమకు సంబంధం లేదని, ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామని కొందరు నేతలు చెప్పారు.
ఇప్పుడు నేరుగా మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర రావు పేరును ఒకరు వాంగ్మూలంలో పేర్కొన్నారని వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇప్పుడు ఏం చేస్తారనే చర్చ సాగుతోంది. కాగా, నయీం కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.