మిడ్డే మీల్స్లో ఎలుక: రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ
హైదరాబాద్: మధ్యాహ్న భోజనంలో ఎలుక ప్రత్యక్షమైన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పిల్లలకు వడ్డించడానికి అన్నం, సాంబార్ తయారు చేశారు. అయితే భోజనం తినే కంటే ముందు సాంబార్ను కలుపుతుండగా ఎలుక కనిపించింది. దీంతో మధ్యాహ్న భోజనాన్ని వడ్డించడం ఆపేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి అంగన్వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది.
ఎలుకను గమనించకుండా భోజనం తినేసి ఉంటే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యేవారు. ముందే ఎలుకను గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. అటు అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు, ఇటు పిల్లల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. వంట సిబ్బందిపై పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో హెడ్ మాస్టర్స్ మృతి
తూప్రాన్ మండలం మనోహరాబాద్ వద్ద కారు - బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బ్రాహ్మణపల్లి, పాంబండ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మృతి చెందారు. మృతి చెందిన ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్రెడ్డి, చంద్రయ్య. ప్రధానోపాధ్యాయుల మృతితో ఆ పాఠశాలల విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. వారి సేవలను తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.
రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ
సికింద్రాబాద్లోని అల్వాల్ మహాబొల్లారంలో రైల్వే ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 25 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 11 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
సికింద్రాబాద్ నార్త్జోన్లో చైన్స్నాచర్స్ రెచ్చిపోయారు. బోయిన్పల్లి, మారేడ్పల్లి, మహంకాళి పీఎస్ పరిధిలో 17 తులాల బంగారం గొలుసులను చైన్స్నాచర్స్ ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.