ఎంసెట్ లీక్ షాకింగ్: కేసీఆర్ని లాగి.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఎంసెట్ 2 పరీక్ష లీకేజీ పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వంలోని కీలక వ్యక్తి పాత్ర ఉందని, ఇంటర్ బోర్డు నిషేధించిన సంస్థకు నామినేటెడ్ పద్ధతిపై కాంట్రాక్టు ఇవ్వడం వల్లే పేపర్ లీకయిందని అభిప్రాయపడ్డారు.
టెండర్లు పిలవకపోవడంపై టీసీఎస్ లాంటి సంస్థలు చేసిన ఫిర్యాదుల పైన ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఎంసెట్ 2 పేపర్ లీక్లో ప్రభుత్వమే ముద్దాయి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తుల మిత్రుల పాత్ర ఉందని ఆరోపించారు.
ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం చేపట్టిన బయోమెట్రిక్ విధానంలో 2,500 మంది విద్యార్థుల బయోమెట్రిక్ పని చేయకపోతే ఆ బాధ్యతను చేపట్టిన సంస్థపై సర్కార్ ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు.
పరీక్ష సంబంధించి ఆన్లైన్ విధాన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ సంస్థను కాదని ప్రయివేటు వ్యక్తులకు సర్కారు ఎందుకు అప్పజెప్పిందని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలన్నారు.
విచారణ జరిపిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యుల మిత్రులు ఇందులో ఉన్నారనే నిజం తెలుస్తోందని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ విధానం కోసం టెండర్ ఇచ్చిన అంశం, ఓఎంఆర్ షీట్ల ప్రింటింగ్, బయోమెట్రిక్ విధానంలో లోపాలు, ఢిల్లీలో ప్రశ్నపత్రం ప్రింటింగ్ అయిన అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టాలన్నారు.
ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యార్థులకు ఇన్ని కష్టాలు వస్తున్నాయన్నారు. ఓ వైపు విచారణ జరుగుతోంటే మరోవైపు లీకేజీ జరగలేదని మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యలు చేశారన్నారు. విచారణ జరుగుతోన్న సమయంలో ఆయన అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నించారు.
లీకేజీ అంశంలో ప్రభుత్వమే ముద్దాయి అన్నారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి నిబద్ధతలేదన్నారు. కుట్రలో కేసీఆర్ కుటుంబ సభ్యులు లేరని ముఖ్యమంత్రి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.