రూ.2 వేల నోటుపై మరో కొత్త ప్రచారం: ఇదీ వాస్తవం!
నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ రూ.2000 నోటును తీసుకు వచ్చింది. ఈ కొత్త నోటు పైన ఎన్నో రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఇంకా కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ రూ.2000 నోటును తీసుకు వచ్చింది. ఈ కొత్త నోటు పైన ఎన్నో రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఇంకా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నమ్మశక్యం అంశాలని రూ.2 వేల నోటుకు ఆపాదించి ప్రచారం చేస్తున్నారు.
సరికొత్త ప్రచారం
జీపీఎస్ ఆధారిత మైక్రోచిప్ పెట్టారని, అందువల్ల పెద్ద మొత్తంలో నోట్లు ఎవరి వద్ద ఉన్నా తెలిసిపోతుందని తొలుత ప్రచారం సాగింది. అది అంతా ఉత్తిదే అని తేలిపోయింది. తాజాగా, మరో కొత్త ప్రచారం ఇంటర్నెట్లో హల్చల్ సృష్టిస్తోంది.
రేడియో ధార్మిక ఇంకు
అందులో పి 32 అనే రేడియో ధార్మికఫాస్పరస్ ఐసోటోప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. రూ.2వేల నోటు ముద్రించేందుకు రేడియో ధార్మిక ఇంకు ఉపయోగించారని సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తిస్తున్నాయి.
ఆదాయపన్ను శాఖ
ఢిల్లీ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, పుణే లాంటి నగరాల్లో రూ.2వేల నోట్లను పెద్ద ఎత్తున దాచిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ప్రచారం మరింత ఎక్కువవుతోంది. ఒకేచోట ఎక్కువ మొత్తంలో ఈ పి 32 అనే పదార్థం ఉంటేనే తెలిసిపోతుందని, అందుకే పెద్దమొత్తంలో నోట్లు ఉన్నచోట దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారు.
నిజం ఏమిటి?
రూ.2 వేల నోటులో చిప్ ఉందన్న ప్రచారం ఎంత అవాస్తవమో ఇది కూడా అంతేనని అంటున్నారు. ఆసలు ఈ నోటు తయారీ విషయంలో రెగ్యులర్గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లే తప్ప ఎలాంటి అదనపు ఫీచర్లు లేవని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. అలాగే ముద్రణకు రేడియో ధార్మిక ఇంక్ వాడారన్న ప్రచారం ఉత్తిదే అంటున్నారు.