జస్టిస్ని మార్చండి: మత్తయ్యపై స్టీఫెన్, టేపులకోసం ఫోరెన్సిక్: ట్యాపింగ్పై..
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య అరెస్టు పైన స్టే ఎత్తివేయాలని ఈ కేసులో కీలకమైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. మత్తయ్య స్క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని కోరారు.
బెంచ్ కూడా మార్చాలని పిటిషన్లో స్టీఫెన్ సన్ కోరారు. మత్తయ్య పిటిషన్ విచారిస్తోన్న జస్టిస్ను మార్చాలని పిటిషన్లో పేర్కొన్నారు. మత్తయ్యకు స్టే ఇవ్వడంతో తనకు అనుమానం కలుగుతోందన్నారు.
ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మత్తయ్యకు అనుకూలంగా వ్యవహరించడంపై అనుమానాలున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా, స్క్వాష్ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. మత్తయ్య అరెస్టు పైన స్టే గడువు రేపటితో ముగుస్తుంది.
ఏసీబీ కోర్టుకు ఎఫ్ఎస్ఎల్
ఏసీబీ కోర్టును ఏస్ఎఫ్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ) ఆశ్రయించింది. కొత్త హార్డ్ డిస్క్, మూడు బ్లాంక్ టేపులు కావాలని కోర్టులో ఎస్ఎఫ్ఎల్ మెమో దాఖలు చేసింది. ఈ మెమోను న్యాయస్థానం ఏసీబీకి అందజేసింది.
రేవంత్ను కలిసిన పయ్యావుల, దూళిపాళ్ల
ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్రలు మంగళవారం కలుసుకున్నారు. రేవంత్ ఆరోగ్య పరిస్థితిపై వారు వాకబు చేశారు. దాదాపు ఇరవై నిమిషాలు రేవంత్తో వారు మాట్లాడారు.
రేపు కీలక పరిణామాలు
ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది. రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ల పైన విచారణను హైకోర్టు 24వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ట్యాపింగ్ పైన ఏఫీ ప్రశ్నల వర్షం
టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఏపీ సిట్ దర్యాఫ్తు బృందం మంగళవారం విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల పైన ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఎనిమిది మంది సర్వీసు ప్రొవైడర్లు విచారణకు హాజరయ్యారు.
మంగళవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు విచారణ సాగింది. నిన్న పదకొండు గంటల పాటు సాగింది. మొత్తం 16 గంటల పాటు విచారణ సాగింది. విచారణ అనంతరం టెలికం సంస్థల ప్రతినిధులు మీడియాతో మాట్లాడలేదు.