సూపర్ సీఎం : కేసీఆర్ నిర్ణయానికి జనం ఫిదా..
'కేసీఆర్..' సిద్దాంతపరమైన వ్యతిరేకాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు గానీ, చాలా సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం కేసీఆర్ దూకుడుకు, ఆయన వాక్చాతుర్యానికి ఫిదా అయిపోతుంటారు. బహిరంగంగా ఈ మాట చెప్పడానికి వాళ్ళు అంగీకరించకపోయినా.. ఓ మాస్ లీడర్ గా తెలంగాణలో అంతటి ఫాలోయింగ్ ఉన్న నేత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
జనం నాడి తెలిసిన నేతగా వీలైనంత మేర ప్రజా సంబంధాలకు ప్రాముఖ్యతనిస్తుంటారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వ్యక్తులెవరైనా సహాయం కోసం కేసీఆర్ ను ఆర్థిస్తే.. చేయూతనివ్వడానికి ఆయనెప్పుడూ వెనుకాడరు. విద్య వైద్యానికి సంబంధించి పేదలకు సహాయం చేసే విషయంలో తక్షణం స్పందిస్తారు.
తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఖమ్మం జిల్లా ముత్తారం గ్రామంలో ఉన్న శ్రీసత్యరామచంద్రస్వామి దేవాలయంలో షేక్ మస్తాన్ అనే వ్యక్తి తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా.. అంతంత మాత్రం ఆర్థిక స్తోమతతోనే నెట్టుకొస్తున్న అతనికి, తన మనువరాలు తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడడం ఆర్థికంగా అతన్ని మరింత కృంగదీసింది. ఇదే క్రమంలో సీఎం ని కలిసి తన బాధ గురించి చెప్పుకున్నాడు మస్తాన్.
పదేళ్లుగా 3వేల రూపాయల వేతనానికే తాను పనిచేస్తున్నానని, వచ్చే జీతంతో మనువరాలికి వైద్యం చేయించడం కష్టంగా మారిందని, తనను ఆదుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ కు విన్నవించుకున్నాడు. దీంతో షేక్ మస్తాన్ బాధను చూసి చలించిన సీఎం కేసీఆర్ , చిన్నారి వైద్యానికయ్యే ఖర్చులన్ని ప్రభుత్వమే భరిస్తుందని హమీ ఇచ్పారు. అప్పటికప్పుడు చిన్నారి వైద్యానికయ్యే ఖర్చుపై అధికారులను ఆరా తీసిన సీఎం, 5 లక్షలు ఖర్చవుతందని చెప్పడంతో ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేశారు.
కేసీఆర్ ఆదేశాలతో వైద్యానికి అవసరమయ్యే ఖర్చులను చెక్కు రూపంలో మస్తాన్ కు అందజేశారు అధికారులు. ముస్లిం అయి ఉండి కూడా ఒక హిందూ దేవాలయంలో పని చేస్తుండడం అభినందించాల్సిన విషయమని షేక్ మస్తాన్ ను మెచ్చుకున్నారు సీఎం కేసీఆర్.