ముందు మీరు రండి.. వచ్చిన తర్వాత అంతా మాట్లాడుకుందాం!?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో టీడీపీ నేతల్లో ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
వెళ్లినవారంతా తిరిగి రావాలి
వివిధ కారణాలవల్ల పార్టీని వదిలివెళ్లినవారంతా తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. గతంలో అనేకమంది నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున లోక్ సభలో, శాసనసభల్లో ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రం విభజనకు గురవడంతోపాటు తెలుగుదేశం పార్టీపై ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేయడంతో తెలంగాణలోని నాయకులంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. 2018 ఎన్నికల్లో కూడా ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను టీడీపీ గెలుచుకోగలిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏపీ కంటే తెలంగాణలోనే పార్టీకి బలం ఎక్కువ.
అమేయశక్తిగా తెలుగుదేశం
మరోసారి ఆ బలాన్ని చాటాలని, పార్టీ అమేయమైన శక్తిగా ఎదగాలని చంద్రబాబు తలపోస్తున్నారు. రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతోపాటు భారీ బహిరంగసభ నిర్వహించారు. ఒకరకంగా ఇతర పార్టీలను ఈ సభ అయోమయానికి గురిచేసిందని చెప్పవచ్చు. సరిహద్దు జిల్లా కావడంవల్ల భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారనుకున్నా అంతస్థాయిలో వస్తారనేది ఇతర పార్టీలు ఊహించలేదని తెలుస్తోంది.
బీఆర్ఎస్ నాయకుల కోసం..
భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సెంటిమెంట్ పనిచేయదని, అన్ని పార్టీలకు ఇది ఒక అవకాశం లాంటిదని విశ్లేషకులు అంటున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు సభ ఏర్పాటు చేశారని, గట్టి నాయకులున్నచోట పార్టీని నియోజకవర్గాలవారీగా బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. టీడీపీ బలం అలాగే ఉంది.. తగ్గలేదు అనే నమ్మకం కలిగిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో అసంతృప్తిగా ఉన్న నేతలంతా టీడీపీవైపు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.