లోకేష్కు షాక్: టిఆర్ఎస్లోకి టిఎన్ఎస్ఎఫ్ నేత ?
హైదరాబాద్: యువతను పార్టీలోకి తెచ్చి, యువశక్తిని పార్టీలో నింపాలని ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్కు తెలంగాణ షాక్ తగిలే అవకాశం ఉంది. టిఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఈడిగ ఆంజనేయలు గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వైపు చూస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీలో బలమైన విద్యార్థి యువ నేత అయిన టిఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఈడిగ ఆంజనేయులుగౌడ్ తెలుగుదేశం పార్టీని వీడి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ఆయన ఓ మంత్రితో కలిసి కెసిఆర్ను కలిసినట్లు సమాచారం. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పెద్దయెత్తున తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్లో చేరునున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన విద్యార్థి నేతలను తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ వారికి సముచిత స్థానం కల్పించారు.
అదే స్థాయిలో ఆంజనేయులుగౌడ్ను కూడా సముచిత స్థానం కల్పిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో వలసల పరంపర ఎక్కడి వరకు కొనసాగుతుందోనని తెలుగుదేశం పార్టీ క్యాడర్లో తీవ్ర కలకలం మొదలైంది. పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఒకవైపు వరుసగా బలమైన నాయకులు పార్టీని వీడుతున్న వైనం కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తోందని అంటున్నారు.
అధికార టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో ఎంతోమంది కరుడుగట్టిన సమైక్యవాదులు టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీని వెన్నంటి నిలిచిన నేతలు సైతం కేసిఆర్ పిలుపుతో పరుగెత్తి కారెక్కారు. రోజుకో నేత పార్టీని వీడుతూ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నారు. గ్రేటర్ నుంచి ఇప్పటికే తలసాని పెద్దయెత్తున టిడిపి క్యాడర్ను ఖాళీ చేయించే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.