8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కన్నేసిన టీఆర్ఎస్..ఎవరై ఉంటారు..?
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు గతేడాది డిసెంబరు 11న వెలువడ్డాయి. ఆ తర్వాత డిసెంబరు 13న కేసీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్తో పాటుగా హోంమంత్రిగా మహమూద్అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి కేబినెట్ విస్తరణపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కొందరు సంక్రాంతి సమయం నాటికి కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేస్తారని చర్చించుకుంటుండగా... పార్లమెంటు ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందని మరో వాదన వినిపిస్తోంది.
2014 అసెంబ్లీ ఫలితాల తర్వాత వెంటనే కేబినెట్ ఏర్పాటు
సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ నేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోతాయి. అంతేకాదు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగిపోతుంది. 2014లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్ 2వ తేదీన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 12 మంతి కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 20న అసెంబ్లీ సమావేశ పరిచారు. అనంతరం ఆరు నెలల్లో అంటే డిసెంబరు 2014లో కేబినెట్ విస్తరణ కూడా చేశారు.
మంత్రివర్గ ఏర్పాటుకు మరో నెలరోజుల సమయం?
ఈ సారి అంటే 2018లో డిసెంబరు 11న ఫలితాలు వెలువడి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇంకా కేబినెట్ను తయారు చేయలేదు. అయితే పూర్తి స్థాయి మంత్రివర్గ ఏర్పాటుకు మరో నెల సమయం తీసుకుంటారనే వార్తలు గులాబీ వర్గాల నుంచి అందుతున్నాయి. ఇందుకు కారణం కూడా టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. శాసనసభకు ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకునేందుకు సరిపడా సమయం దొరుకుతుంది కాబట్టే కేబినెట్ కూర్పులో జాప్యం జరగుతోందనే వార్త షికారు చేస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాలు గెలిచింది. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 12 స్థానాలు రావాలి. అయితే కాంగ్రెస్కు 19 స్థానాలు వచ్చాయి కాబట్టి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తింపు వచ్చినట్లే. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే వ్యూహంతో గులాబీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ ఎనిమిది ఎమ్మెల్యేలను గులాబీ గూటికి చేర్చగలిగితే ఇక కాంగ్రెస్కు ప్రతిపక్షం హోదా అనేది ఉండదు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం ఎరవేస్తోన్న గులాబీ బాస్..?
2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి ఫిరాయింపులు బాగానే జరిగాయి. అయితే ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి ఎమ్మెల్యేలను ఆహ్వానించి తమకున్న బలాన్ని టీఆర్ఎస్ పెంచుకోగలిగింది. కానీ ఈసారి తగినంత బలం ఉన్నప్పటికీ... ప్రధాన ప్రతిపక్షాన్ని మరింత బలహీనపర్చాలనే యోచనలో గులాబీ బాస్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందుకోసమే కాంగ్రెస్ నుంచి వచ్చే వారికి మంత్రి పదవులు ఎరచూపుతున్నట్లు సమాచారం. మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తే ఉమ్మడి జిల్లాల నుంచి ఒక వ్యక్తికి ముందుగా ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం మెదక్ నుంచి సీఎంగా కేసీఆర్ ఉండగా హైదరాబాద్ నుంచి హోంమంత్రిగా మహమూద్ అలీ ఉన్నారు. మరో 8మందిని ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రులుగా తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇదిలా ఉంటే కేబినెట్ మంత్రుల సంఖ్య సీఎంతో కలుపుకుని 18కి మించి ఉండరాదు.