నిపా వైరస్: హైదరాబాద్ లో ఇద్దరికి సోకినట్టుగా అనుమానం..
హైదరాబాద్: హైదరాబాద్ లో ఇద్దరు వ్యక్తులకు నిపా వైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్నారు. వీరిలో ఓ వ్యక్తి ఇటీవలే కేరళ వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. ఇరువురి బ్లడ్ శాంపిల్స్ను వ్యాధి నిర్ధారణ కోసం పుణెలో గల నేషనల్ ఇనస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కు పంపించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ డా.రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. 'భయపడాల్సిన అవసరం లేదు. బ్లడ్ శాంపిల్స్ను వ్యాధి నిర్ధారణ కోసం పంపించాం' అని చెప్పారు. 'నిపా సోకినట్టుగా అనుమానిస్తున్న ఇద్దరిలో ఒకరు ఇటీవలే కేరళ వెళ్లి వచ్చారు. దీనిపై కేరళలో ఉన్న జాతీయ వ్యాధి నియంత్రణ అధికారులతో మాట్లాడాను.
కేరళలో నిపా బయటపడ్డ ప్రాంతానికి ఆ వ్యక్తి వెళ్లిన ప్రాంతానికి వందల కిలోమీటర్ల దూరం ఉందని, కాబట్టి అతనికి నిపా పాజిటివ్ వచ్చే అవకాశాలు తక్కువ అని తెలిపారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి తాము అన్నివిధాలా సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు.
నిపా వైరస్ నుంచి కాపాడే రక్షణాత్మక జాకెట్లను ఇప్పటికే ఆర్డర్ చేశామని, తద్వారా ఆసుపత్రి సిబ్బందికి వ్యాధి సోకే అవకాశం ఉండదని అన్నారు. నిపా వైరస్ కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. చెట్టు పైనుంచి రాలిపడ్డ పండ్లను, పక్షులు కొరికిన గుర్తులు ఉన్న పండ్లను తినవద్దని సూచిస్తున్నట్టు తెలిపారు.
కేరళలోనూ నిపా వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. కేరళ కోజికోడ్ కలెక్టర్ యూవీ జోస్ బహిరంగ సమావేశాలను నిషేధించారు. శిక్షణ శిబిరాలు, ట్యూషన్లను సైతం మే 31 వరకు నిలిపివేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో కాలికట్ యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది.
గురువారం కేరళ నుంచి 160మంది బ్లడ్ శాంపిల్స్ పుణే ఆరోగ్య శాఖకు పంపించగా.. అందులో 22 బ్లడ్ శాంపిల్ రిపోర్టులు వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చిన 22 రిపోర్టుల్లో 14 నిపా పాజిటివ్ అని తేలడం గమనార్హం. ప్రస్తుతం కోజికోడ్ మెడికల్ కాలేజీలో 136మంది నిపా రోగులు చికిత్స పొందుతున్నారు. అలాగే మలప్పురం జిల్లాలోనూ మరో 24మంది రోగులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
కాగా, నిపా వైరస్ ఎక్కువగా గబ్బిలాలు, పందులు, లేదా నిపా సోకిన వ్యక్తుల నుంచి వ్యాప్తి చెందుతోంది.