అంతులేని వ్యథ: వీణా వాణీలపై చేతులెత్తేసిన ఎయిమ్స్, తల్లిదండ్రుల వేడుకోలు
హైదరాబాద్: తలలు అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు 'వీణా-వాణి'లను విడదీయలేమని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చేతులెత్తేశారు. దీంతో తమ పిల్లల కష్టాలు తీరుతాయనుకున్న వీణావాణీల తల్లిదండ్రులకు మరోసారి బాధే మిగిలింది. ఈ నేపథ్యంలో తమకు ఏదైనా జీవన భృతిని కల్పిస్తేగానీ తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లలేమని ఆ అవిభక్త కవలల తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఈ క్రమంలో నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు వీణావాణీల పరిస్థితులను వివరిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అవిభక్త కవలలు 'వీణా-వాణి' జన్మించిన రోజునుంచి నేటికీ నిలోఫర్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్నారు. ఇరువురిని విడదీయడానికి ఇప్పటికే దేశ, విదేశాల నుంచి పలు వైద్య బృందాలు రావడం, వెళ్లడం జరిగింది. గతంలో లండన్ వైద్యులు తాము వారిని విడదీస్తామని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత వారు ముందుకు రాలేదు.
వీణా-వాణీలను విడదీసేందుకు: సక్సెస్ రేట్ 80 శాతం (పిక్చర్స్)
రెండు నెలల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి సైతం ప్రత్యేక వైద్యుల బృందం వచ్చింది. నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్కుమార్, ప్రొ.డాక్టర్ రమేశ్రెడ్డి, ఆర్ఎంఓ ఉషారాణి, నిర్వహణాధికారి డాక్టర్ రేణుకాచారి అవిభక్త కవలల ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ బృందానికి వివరించారు. వారు సూచించిన మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలను ఢిల్లీకి పంపించారు.
ఆ నివేదికలను క్షుణ్నంగా పరిశీలించి అవిభక్త కవలల విడదీయలేమని ఎయిమ్స్ వైద్యులు తేల్చి చెప్పేశారు. ప్రధానంగా మెదడులో నాడీ వ్యవస్థ ఒకటే ఉంది. కాబట్టి శస్త్రచికిత్స చేస్తే ఇద్దరికీ ప్రాణహాని ఉందని, పలుమార్లు కోమాలోకి వెళ్లడమో.. పక్షవాతం, నరాలకు సంబంధించిన క్షీణత వంటి సమస్యతో బతకాల్సి ఉంటుందని వైద్య బృందం స్పష్టం చేసిందని డాక్టర్ రేణుకాచారి తెలిపారు.
జీవనభృతి కోసం తల్లిదండ్రుల వేడుకోలు
ఎయిమ్స్ వైద్యుల నివేదిక వచ్చిన తరువాత నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్కుమార్ బృందం వీణా-వాణిల తల్లిదండ్రులు మారగోని మురళి, నాగలక్ష్మిలను పిలిపించి మాట్లాడారు. వారి అభిప్రాయాలను నమోదు చేశారు. పదేళ్లకుపైగా వీణా-వాణిలు నిలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు.
ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఇంటికి తీసుకెళ్లమంటే వారిని సాకే స్తోమత తమకు లేదని వీణావాణీల తల్లిదండ్రులు స్పష్టం చేసినట్లు డా.రేణుకాచారి తెలిపారు. ప్రభుత్వం సహాయ సహకారాలు, పిల్లలకు భృతిని కల్పిస్తే తీసుకెళ్లడానికి అభ్యంతరం లేదని చెప్పినట్లుగా వివరించారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు, ఎయిమ్స్ వైద్యుల నివేదికలోని సారాంశాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు నిలోఫర్ వైద్యులబృందం తెలిపింది.