మాటకు మాట: 'ఆంధ్రావాడివా... తెలంగాణవాడివా.. బుద్ధులు మార్చుకోవా..'
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి, బిజెపి శాసనసభ్యుడు చింతల రాంచంద్రారెడ్డిల మధ్య బుధవారం తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.. ఒకరినొకరు రెట్టించుకునే దాకా వెళ్లడంతో చివరికి సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు ఇద్దరికీ సర్దిచెప్పాల్సి వచ్చింది.
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలపై మజ్లీస్ పార్టీ కార్యకర్తల దాడి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డిని బుధవారం అఖిలపక్షం కలిసింది. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, షబ్బీర్అలీ, పొంగులేటి సుధాకర్రెడి, టిడిపి నుంచి ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్రావు, బీజేపీ నుంచి లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, వైసీపీ నుంచిశివకుమార్ నాగిరెడ్డిని కలిసినవారిలో ఉన్నారు.
నాగిరెడ్డితో అఖిలపక్ష నేతలు మాట్లాడుతున్న సందర్భంలో చింతల రాంచంద్రారెడ్డి, నాగిరెడ్డి మధ్య వాగ్వాదం మొదలైంది. తెలిసిన వివరాల ప్రకారం - ఎన్నికల సందర్భంగా పోలీసులు, ఎన్నికల కమిషన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అనుకూలంగా పనిచేశాయని, గులాబీ చొక్కాలు వేసుకున్నవారిలా వ్యవహరించారని చింతల ఆక్షేపించారు.
దీంతో తీవ్ర అసహనం వ్యక్తంచేసిన నాగిరెడ్డి.. ‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?' అన్నారు. ‘నువ్వు.. అంటూ ఏకవచనంలో పిలుస్తున్నావేంటి? నేను ఎమ్మెల్యేను. నువ్వు అంటూ ఏక వచనంతో ఎలా పిలుస్తావ్?' అని చింతల అన్నారు.
‘తెలంగాణవాడివి కాదా? ఆంధ్రావాడివా? బుద్ధులు మార్చుకోవా?' అంటూ నాగిరెడ్డి రెట్టించారు. ఈసీవా, ప్రాంతీయవాదివా అంటూ నాగిరెడ్డిని చింతల ప్రశ్నించారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుండంతో జానారెడ్డి, షబ్బీర్ అలీ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు.