23 దాకా ఆగుదాం, బహిరంగలేఖ రాసి మీ తప్పుచెప్తాం: కేసీఆర్పై కొండా సురేఖ
వరంగల్/హైదరాబాద్: హన్మకొండలోని రామ్నగర్లో అభిమానులు, కార్యకర్తలతో మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సోమవారం భేటీ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, మరో పార్టీలో చేరాలని పలువురు అనుచరులు వారికి సూచించారు.
అయితే అప్పుడే తొందర వద్దని వారు నచ్చచెప్పారు. ఈ నెల 23వ తేదీ వరకు వేచి చూద్దామని, ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిద్దామని కార్యకర్తలకు కొండా దంపతులు స్ఫష్టం చేశారు. తెరాస నుంచి స్పందన లేకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కొండా సురేఖ వెంట ఎంతమంది వెళ్తారు? రంగంలోకి నేతలు: 'కేసీఆర్ అప్పుడే పసిగట్టారు'
తెలంగాణలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాం
తెలంగాణలో ఎక్కడ నుంచి పోటీ చేసినా తాము కచ్చితంగా గెలుస్తామని ఎమ్మెల్సీ కొండా మురళి ధీమా వ్యక్తం చేశారు. కొండా సురేఖకు తొలి జాబితాలో టిక్కెట్ ప్రకటించక పోవడంపై టీఆర్ఎస్ అధిష్టానాన్ని వివరణ కోరామని, కానీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బహిరంగ లేఖ రాసి వారి తప్పు చెబుతాం
తెరాస పార్టీ వైఖరిపై 12వ తేదీన మీడియా ముఖంగా బహిరంగ లేఖ రాసి వారు చేసిన తప్పు ఏమిటో బహిర్గతం చేస్తామని కొండా మురళీ తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ పైన ఈనెల 23వ తేదీ తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. టిక్కెట్ నిరాకణపై వివరణ కోరినా ఇప్పటి వరకు సమాధానం రాకపోవడం సరికాదన్నారు.
అప్పుడే కాంగ్రెస్లోకి
కాగా, కొండా సురేఖ దంపతులు ఈ నెల 12వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ వారు మాత్రం 23వ తారీఖీ వరకు వేచి చూస్తామని తెలిపారు. ఆ తర్వాత అయినా వారు కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వారి కుటుంబంలో ఇధ్దరికి టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాతనే చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ హామీ వచ్చిందని కూడా చెబుతున్నారు.
టిక్కెట్ ఇవ్వరని తేలిపోయిందా
కొండా సురేఖకు తెరాస టిక్కెట్ ఇవ్వదాని దాదాపు తేలిపోయిందని అంటున్నారు. కొండా సురేఖ మాటలు, దానికి తెరాస నేతల ఎదురుదాడి చూస్తుంటే ఆమె పార్టీ నుంచి వెళ్లిపోవడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. అయితే తెరాసకు సమయం ఇచ్చినట్లు ఇచ్చి, అలాగే తమకు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, ఆ తర్వాత పార్టీని వీడాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మరో రెండు వారాలు వేచి చూస్తున్నారని అంటున్నారు.