అరే సిగ్గుండాల్రా బాబూ.!ఢిల్లీ నుండి ఎందుకురా బై వాపస్ ఒచ్చింది.?టీఆర్ఎస్ ఏంపీలపై మండిపడ్డ వీహెచ్.!
హైదరాబద్ : టీఆర్ఎస్ ఎంపీలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో తాడో పేడో తెల్చుకుంటామని వెళ్లి తోక ముడుచుకుని వాపస్ వచ్చారని, అసలు టీఆరెఎస్ ఎంపీలు పార్లమెంట్ కు వెళ్లి ఏం సాధించుకునీ వచ్చారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని నిలదీసారు. టీఆరెఎస్ ఎంపీలు జిల్లాల్లో తిరుగుతామని చెప్పడం సిగ్గుచేటని, జిల్లాల్లోకి వచ్చే టీఆరెఎస్ ఎంపిలను ప్రజలు నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. టీఆరెఎస్, బీజేపీ పార్టీలు రైతుల నోట్లో మట్టి కొట్టారని, ప్రతి గింజా కొంటామని చెప్పిన చంద్రశేఖర్ రావు కేంద్రంపై నెపం మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు వీహెచ్.
బీజేపిని చూస్తే టీఆర్ఎస్ భయపడుతోంది.. పార్లమెంట్ సమావేశాలను ఎందుకు బహిష్కరించారన్న వీహెచ్
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధ్యాన్యం కొనుగోలు అంశంలో ఒప్పిస్తామని గొప్పలు చెప్పిన గులాబీ ఎంపీలు ఏం మాట్లాడకుండానే వెనక్కుతిరిగారని, రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక రకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలను రైతాంగాన్ని పచ్చి మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు తీవ్ర ఆరోపణలు చేసారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రైతాంగం అనేక ఇబ్బందులు పడుతోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు విహెచ్.
పార్లమెంట్ కాదని గ్రామాల్లోకా.. ప్రజలు టీఆర్ఎస్ ఎంపీలను తరిమికొట్టాలన్న కాంగ్రెస్
అంతే కాకుండా వడ్ల కొనుగోలు అంశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారని, చంద్రశేఖర్ రావు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, పార్లమెంట్ లో టీఆరెఎస్ ఎంపిల నాటకాలు కూడా రైతులు గమనించారని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ వదిలి గ్రామాలకు వెళతామని టీఆరెఎస్ ఎంపీలు చెప్పడం బాధ్యతా రాహిత్యమని అన్నారు. టీఆరెఎస్ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్ముక్కయ్యిందని,గోదాముల్లో మాయమైన బియ్యం ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు.
ఆఖరు గింజ కొనే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం.. ధాన్యం కల్లాల్లోనే మగ్గుతుందన్న కాంగ్రెస్
అంతే కాకుండా రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దీనికి సమాధానం చెప్పాలని నిలదీసారు. వడ్ల కొనుగోలు పై కాంగ్రెస్ ఎప్పుడు రాజకీయం చేయదుని, రాష్ట్రంలో ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయన్నారు. ఆఖరు గింజ కొనే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, టీఆరెఎస్ నాయకులు వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కోదండ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆరెఎస్ ఎంపీలు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని సంచలన వ్యాఖ్యలు చేసారు కోదండరెడ్డి.
ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ఎంత మద్దతు ధర ఇస్తుంది. స్పష్టం చేయాలన్న కాంగ్రెస్
వరి ధాన్యం కొనుగోలు అంశంలో బీజెపి, టీఆరెఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నారని, ఇన్ని రోజులు పార్లమెంట్ లో డ్రామాలు అడిన ఎంపీలు ఇప్పుడు పారిపోయి వచ్చారని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆరోపించారు. టీఆరెఎస్ బీజేపీ డ్రామాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిల్లర్ల కు లబ్ది చేకూర్చేలా టీఆరెఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో మిల్లులు అన్నీ టీఆరెఎస్ నాయకులవే అని, టీఆరెఎస్ ఎంపీలు గ్రామాలకు వస్తే తన్ని తరిమేయాలని, వరికి ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ఎంత మద్దతు ధర ఇస్తుందో స్పష్టత ఇవ్వాలని అన్వేష్ రెడ్డి డిమాండ్ చేసారు.