అమెరికాలో 'ఆకాశమే హద్దు'
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని పలు సంస్థల సహకారంతో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో ‘లక్ష్య నిర్దేశం-ఆకాశమే హద్దు' అనే అంశంపై సెప్టెంబర్ 29న సాయంత్రం బే ఏరియాలోని భారతీయ రెస్టారెంట్ అతిథిలో వ్యక్తిత్వ వికాస కోర్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అంతర్జాతీయ వ్యక్తిత్వ వికాస నిపుణుడు వివి సన్సాసిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సుమారు వందమందికిపైగా పాల్గొన్న ప్రవాసాంధ్రులు వ్యక్తిత్వ వికాసం వల్ల ఒనగూరే లాభాలను తెలుసుకున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నాట్స్ బే ఏరియా ఇంఛార్జ్ విపి శ్యామ్ జాగర్లమూడి స్థానిక సంస్థల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రవాసాంధ్రుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను తరచూ ఏర్పాటు చేయనున్నట్లు శ్యామ్ తెలిపారు.
ప్రముఖ ప్రవాసాంధ్రుడు విజయ్ చవ్వా ప్రారంభ ఉపన్యాసం చేశారు. నాట్స్ తలపెట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సామాజిక బాధ్యతగా తన ప్రసంగాలతో భారతదేశంలోనూ, అంతర్జాతీయంగానూ పలువురిలో వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తున్న వివి సన్యాసిరావు సేవలను ఆయన కొనియాడారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పాఠశాలలు, కళాశాలలు, మురికి వాడల్లో నివాసముంటున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లి తన ప్రసంగాలతో ఇప్పటివరకు సుమారు 2,25,000మందిని చైతన్య పరిచినట్లు ఆయన తెలిపారు. ఈ సంఖ్య మరికొన్నేళ్లలో మిలియన్కు చేరుకోవాలని ఆయన అభిలాషించారు.
ట్రైనింగ్, ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ వివి సన్యాసిరావు ప్రవాసాంద్రులకు లక్ష్య నిర్దేశనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మానవ జీవితంలో విజయం అనేది సహజమన్నారు. ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమపద్ధతి ప్రకారం కృషి చేస్తే విజయం సిద్ధిస్తుందని తెలిపారు. లక్ష్యం అనేది విజయానికి ముఖ్య సోపానం అని న్నారు. విజయాన్ని సాధించాలనుకునే వారు లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించరని ఆయన అన్నారు. విజయం కోసం లక్ష్యం ఏర్పరచుకోవడం ముఖ్యమని, లక్ష్యాన్ని సాధించడం కోసం నిర్విరామంగా కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుందని సన్యాసిరావు చెప్పారు.
ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతమయ్యేందుకు కృషి చేసిన విజయ్ చవ్వాను నాట్స్ బే ఏరియా ఇంఛార్జ్ శ్యామ్ జాగర్లమూడి అభినందించారు. కార్యక్రమంలో ఎన్నార్ఐవి డైరెక్టర్ గౌరస్వామి కృష్ణమూర్తి, నాట్స్ సభ్యులు రాజ్ జాకిలాటి, సుమన్, కృష్ణ యెలిషెట్టి, రవి చంద్ర అనంత, తదితరులు పాల్గొన్నారు.