తానా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నిరంజన్ శృంగవరపు
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా-తానా) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. తానా నూతన అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల తన సమీప అభ్యర్థి నరేన్ కొడాలిపై ఆయన గెలుపొందారు. నిరంజన్కు 10866 ఓట్లు లభించగా, నరేన్కు 9108 ఓట్లు లభించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన నిరంజన్ అమెరికాలోని మిషిగాన్లో నివాసముంటున్నారు. తానా ఎన్నికల్లో గెలుపుతో నిరంజన్ ప్యానల్ సంబరాలు చేసుకుంది. నిరంజన్ శృంగవరపు తానా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుత అధ్యక్షుడు జై తాళ్లూరి అన్నారు. నిరంజన్ టీంకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశంవిడుదల చేశారు.
తానాలో గెలుపు ఓటములు ఉండవని, పోటీ చేసినవారంతా గెలిచినట్లేనని జై తాళ్లూరి వ్యాఖ్యానించారు. తానా అభ్యున్నతికి అందరూ కలిసి పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తానా ఆధ్వర్యంలో మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి అమెరికా, భారత్లో ఎందరికో ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. తానా ఎన్నికల్లో మొత్తం ఓట్లు 33,875 ఉండగా, పోలైన ఓట్లు 21వేలు ఉన్నాయి. ఇక ఇక చెల్లని ఓట్లు 2,800 ఉన్నట్లు గుర్తించారు.