పార్ట్-4
వారి ముఖాల్లో ఏ మాత్రం ఆందోళన లేదు. రైలు కదిలింది. ఆ ముగ్గురిని వెంటాడుతూ డజను కళ్లు. ఈ డజను కళ్ల అరడజను మందికి కూడా సాధారణ ప్రయాణిలకు మాదిరిగానే ప్రత్యేక ముఖాలేమీ లేవు. నోట్లో కోరలు లేవు. నెత్తి మీద కొమ్ముల్లేవు. వాళ్లేసుకున్న దుస్తుల్లో ఏమైనా దాగున్నాయేమో తెలియదు. అందువల్ల ఆ ముగ్గురు వీరిని గుర్తించలేకపోయారు. కనీసం వాసనైనా చూడలేకపోయారు. ఈ డజను కళ్లు మాత్రం నిరంతరం ఆ ముగ్గురినే గుర్తిస్తూ వున్నాయి. ఈ అరడజను మందికి వాసన పసిగట్టే నేర్పుందని ఆ ముగ్గురికి తెలియదు.
తెల్లారేసరికి ఆ ముగ్గురు రైలు దిగారు. వారి వెంటే ఆ అరడజను మందీ దిగారు. అయితే ఈ అరడజను ముంది గుంపుగా దిగలేదు. ఒకరికొకరు పరిచయం లేనట్టుగానే ఈ ముగ్గురి చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. ఆ ముగ్గురి కదలికలను బట్టే వారి కదలికలు వెనక్కి ముందుకు వుంటున్నాయి. రాబోయే విపత్తును ఆ ముగ్గురూ గమనించినట్లు లేదు. ఆ ముగ్గురు బయటకు వచ్చి ఆటో స్టాండు వద్ద నిలబడ్డారు. ఒక వ్యక్తి వచ్చి ఆ ముగ్గురినీ కలుసుకున్నాడు. ఆ ముగ్గురు అతనితో మాట్లాడుతున్నారు.
వివిధ వేషాల్లో ఉన్న ఆ అరడజను మంది ముగ్గుర్ని చుట్టుముట్టారు. ఊహించని పరిణామానికి ఆ ముగ్గురి ముఖాలు వివర్ణమయ్యాయి. వారి ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. అంత హఠాత్పరిణామంలో వాళ్లు బొడ్లోకి చేతులు దూర్చి ఏవో తీయబోయారు. ఆ చేతులను ఒక్కేసారి ఆ ఆరుగురు ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఒడిసి పట్టుకున్నారు. చేసేది లేక ఆ నలుగురు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కతను ఒక్కో వ్యక్తిని పట్టుకున్నాడు. అతి సాధారణ మనుషులుగా కనిపిస్తున్నప్పటికీ వారి చేతుల్లో ఉక్కు బలం ఉంది. ఎంత గుంజుకున్నా వారి పట్టు మరింత బిగుసుకుంటుందే తప్ప వదులు కావడం లేదు. నోరు తెరిస్తే కాల్చేస్తామని బెదిరించారు. నిజానికి ఊహించని ఈ సంఘటనకు ఆ ముగ్గురి నోటంట మాట రాలేదు. ఆ ఆరుగురి ముఖాలు అతి ప్రశాంతంగా వున్నాయి. బయటివారికి కనబడకుండా ఆ ముగ్గురి శరీరాలకు పిస్టల్స్ విడివిడిగా పిస్టల్స్ ఆనించి టాటా సుమోలో ఎక్కించారు. పోలీసుల వలలో చిక్కిపోయామని ఆ ముగ్గురికి అర్థమైపోయింది. తమ ముఖాల మీద ప్రత్యేకమైన గుర్తేదో రాసి పెట్టి వుందనే విషయం అప్పుడర్థమైపోయింది ఆ ముగ్గురికి. ఆ ముగ్గురిలో అవినాష్ కూడా వున్నాడు. ఒకతను నక్సలైట్ పార్టీ టాప్ లీడర్ కాగా, మరొకతను అవినాష్కు కిందిస్థాయి నాయకుడు. వీరిని కలవడానికి వచ్చిన నాలుగో వ్యక్తి కొరియర్.
ఆ టాటా సుమో నక్సలైట్ల ప్రమేయం లేకుండానే వారి డెన్కు చేరుకుంది. దీంతో అవినాష్తో పాటు మిగతా ముగ్గురు కూడా ఆశ్చర్యపోయారు. అంటే తాము బయలుదేరే విషయం, ప్రయాణం చేసే విషయం మాత్రమే కాకుండా బెంగుళూర్లో ఎక్కడ వుండబోతున్నామనే విషయం కూడా ముందే తెలిసిందన్న మాట అనుకునే సరికి వారు మరింతగా కలవర పడ్డారు. శత్రు శిబిరంలో తమకు చెందిన ముఖ్యమైనవారెవరో చేరిపోతే తప్ప ఈ సమాచారం తెలిసే ప్రసక్తి లేదని వారికి తెలుసు. ఈ సత్యం అర్థమయ్యేసరికి వెన్నులో చలి పుట్టింది. తమకు చావు తప్పదనే విషయం ఆ నలుగురికి తెలుసు. అది చావుకు భయపడడం వల్ల పుట్టిన చలి కాదు, తాము ముప్పయ్యేళ్లుగా పెంచి పోషించుకుంటూ వచ్చిన ఉద్యమం గతి అర్థమై పోయి పుట్టిన చలి.