బాల గెరిల్లా జ్ఞాపకాల కథనం
తెలంగాణ సాయుధ పోరాటంలో బాల గెరిల్లాగానూ, ముఖ్య నాయకులకు కొరియరుగానూ పనిచేసిన కందిమళ్ల ప్రతాపరెడ్డి రచించిన నవల బందూక్.
నిజాం పాలిత ప్రాంతంలో యధేచ్ఛగా కొనసాగిన దొరల అకృత్యాలనూ, రజాకార్ల అమానుషాలనూ, ఆరాచకాలనూ ఈ నవల చిత్రించింది. మైసయ్య, ముత్యయ్య, లచ్చుమమ్మలాంటి గ్రామీణులెందరో దొర దౌర్జన్యాలకు బలయ్యారు. జీవితావసరాల కోసం షావుకారు వద్ద అప్పు చేయడం, దాన్ని తీర్చలేక అతడి దగ్గర పనిచేయడానికి అంగీకరించడం, చచ్చేంత వరకూ అక్కడే వెట్టిచాకిరి చేయడం... వంటి సంఘటనలు ఆనాటి సామాజిక స్థితిగతులకు అద్దం పడుతున్నాయి.
సామాన్య ప్రజలు చేసే చిన్న చిన్న తప్పులకుగాను శిక్షించే సందర్భాల్లో చింత బరిగెలు, ఈత బెత్తాలు, కర్రలు, తెల్లరాతి బండలు, తోళ్లు, కొరడాలు సిద్ధంగా ఉంటాయని రచయిత వర్ణించిన తీరు అప్పటి భూస్వామ్య సమాజపు రాక్షసత్వాన్ని సూచిస్తున్నది. రజాకార్ల ఆకస్మిక దాడులు, వందలాది మంది అమాయక ప్రజలు చనిపోవడం, స్త్రీల మానభంగాలు, ఇళ్లు దోచుకోవడం వంటి అకృత్యాలు రవిని అశాంతికి గురి చేస్తాయి. అతడు సంగం వైపు ఆకర్షింపబడతాడు. అతని ప్రేరణతో ఊర ఊరంతా ఒక్కటవుతుంది. సంగం శక్తితో అందరిలోనూ చైతన్యం వెల్లివిరుస్తుంది. ఈ పూర్వరంగంలో రవి జైలు పాలవుతాడు. వ్యక్తిగత జీవితం, రాజకీయ లక్ష్యం - ఈ రెండింటిలో దేన్ని వదులుకోవాలన్నది అతనికో ప్రశ్నగా మారుతుంది. చివరికి రాజకీయ పోరాటానికే జీవితాన్ని అంకితం చేయాలని అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఇష్టపడిన మరదలిని మరచిపోవడానికి సిద్థపడతాడు.
సంగం నాయకులను హతమార్చడానికి దొర చేసే దుర్మార్గపు ఆలోచనలు, పటేల్ పాపిరెడ్డి కుటిల ప్రయత్నాలు... వాటిని సంఘం కార్యకర్తలు ఎదుర్కొన్న తీరుతెన్నులను ఈ నవల అద్భుతంగా చిత్రించింది.ఒక దొరను చంపితే వ్యవస్థ మారదు. దొరలు, దోపిడీదార్లను పెంచి పోషించే ప్రభుత్వం పతనం కావాలి అంటూ నవలా నాయకుడు రవి ప్రజల్లో ఆలోచన్లను రేకెత్తిస్తాడు. ప్రజలు చైతన్యవంతులవుతారు. సంఘం పతాక నీడ కింద దొరతనంపై తిరగబడతారు. ఎన్నో కష్టనష్టాలను భరించి, విజయం సాధిస్తారు.
నవలలోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు సరళంగానూ, సహజంగానూ ఉండడం వల్ల, ఒక కథనో, నవలనో చదువుతున్నట్లు కాకుండా, సమీప గతంలోని చరిత్రను చదువుతున్న అనుభూతిని పాఠకులు పొందే విధంగా రచయిత బందూక్ నవలను తెలుగు సాహిత్యలోకానికి అందించారు.












Click it and Unblock the Notifications