ఉప రాష్ట్రపతి పోల్స్: అందుకే జగన్, టిడిపి దూరం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కడప నుండి వైయస్ జగన్, నెల్లూరు నుండి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీలుగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో యుపిఏ అభ్యర్థికి ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు ఉప రాష్ట్రపతి ఎన్నికలలో మాత్రం ఓటు వేయకూడదని నిర్ణయించుకుంది. అందుకే చంచల్గూడ జైలులో ఉన్న జగన్ ఓటు వేసేందుకు ప్రత్యేక బెయిల్ కోసం కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. అందుకు విపక్షాల నుండి వస్తున్న లాలూచీ ఆరోపణలే కారణమని అంటున్నారు. దీంతో మేకపాటి, జగన్ ఓటింగ్కు దూరంగా ఉండనున్నారు.
తెలుగుదేశం పార్టీ కూడా ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీ రాష్ట్రపతి ఎన్నికలలోనూ ఏ పార్టీకి మద్దతు పలకలేదు. ఇప్పుడు కూడా ఎవరికి ఓటు వేయవద్దని నిర్ణయించుకున్నది. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్కు ఓటేయడం ద్వారా కాంగ్రెసుతో లాలూచీ విమర్శలు తమపై జోరుగా రావడంతో జగన్, ఇప్పటికే కాంగ్రెస్తో కుమ్మక్కు అన్న నింద నుండి బయటపడేందుకు అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలకు ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు టిడిపి దూరంగా ఉంటోంది. ఇక మతతత్వం పేరుతో బిజెపికి ఆ రెండు పార్టీలు మద్దతివ్వడం లేదు. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఓటేయాలని చెప్పిన జగన్ పార్టీ ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఓటేయక పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కాగా ఈ రోజు జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో యుపిఏ అభ్యర్థి హమీద్ అన్సారీ గెలుపు లాంఛనమేనని భావిస్తున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా జశ్వంత్ సింగ్ బరిలో దిగుతున్నారు. 788 మంది సభ్యులు మొత్తం ఓటు వేయనున్నారు. అన్సారీకి కనీసం 500 వరకు ఓట్లు పడవచ్చునని భావిస్తున్నారు. కాంగ్రెసు ఒక్కదానికే లోకసభలో 204 మంది, రాజ్యసభలో 71 మంది సభ్యులు ఉన్నారు. ఇక మిత్ర పక్షాల మద్దతుతో అన్సారీ ఈజీగా గెలుపు గుర్రమెక్కే అవకాశముంది.