సంచలనం: బీజేపీ బాబుపై ఆ అస్త్రం సంధించిందా?, టీడీపీ భయపడుతోందా?
Recommended Video

అమరావతి: 2014 ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన.. ఇప్పుడు శత్రువులుగా మారిపోవడం రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనేదానికి అద్దం పడుతోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఎప్పుడైనా విభేదాలు తలెత్తినా.. టీడీపీ నేతలు కాస్త దూకుడుగా పవన్ కల్యాణ్ పైనో.. బీజేపీ పైనో విమర్శలు చేసినా.. 'సంయమనం' పాటించాలని సీఎం చంద్రబాబు అడ్డు తగిలేవారు.
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ పై, బీజేపీపై టీడీపీ నేతలతో మూకుమ్మడిగా మాటల దాడి చేస్తున్నారాయన.
ఒకవిధంగా ఒకరంటే ఒకరికి ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అంతేనా.. మిత్రులుగా ఉన్నప్పుడు కనిపించని తప్పులు కూడా ఇప్పుడు వారికి బాగా కనిపిస్తున్నాయి. ఒకరి బలహీనతలపై మరొకరు దెబ్బకొట్టాలని కాచుకు కూర్చున్నారు.

బీజేపీ 'ఆపరేషన్ గరుడ'..:
ఏపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిందనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణ. పవన్ ఆరోపణల్లో 90శాతం నిజం ఉందని అటు బీజేపీ కూడా ఇదే వాదన వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ జరిగే ప్రమాదం ఏర్పడింది.
ఇంతలోనే కేంద్రం 'ఆపరేషన్ గరుడ' అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న విషయం తెలిసి టీడీపీ మరింత ఉలికిపడుతోంది.

లెక్కలతో సహా బయటపెడుతారా?:
లోకేష్ అవినీతి గురించి మాకు తెలియదు కానీ, రాష్ట్రంలో ఇసుక మాఫియా, విశాఖ భూముల కబ్జా, రాజధాని భూసేకరణ, అలాగే పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది అందరికీ తెలిసిన సత్యమేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ అవినీతిని లెక్కలతో సహా బయటపెట్టేందుకే కేంద్రం 'ఆపరేషన్ గరుడ' అనే అస్త్రాన్ని సంధించినట్టు చెబుతున్నారు.

చంద్రబాబు అలర్ట్:
రాష్ట్రంలో బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే చంద్రబాబు ప్రయత్నాలను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు పాలనలోని అవినీతి బండారాన్ని బయటపెట్టి.. దెబ్బకు దెబ్బ తీయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అటు చంద్రబాబు సైతం టీడీపీ నాయకులను అలర్ట్ చేశారని తెలుస్తోంది. కేంద్రం ఎప్పుడు ఎలాంటి చర్యలకు దిగుతుందో తెలియదు కాబట్టి.. నేతలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించినట్టు సమాచారం.

'అవినీతి' ఆరోపణలతో డ్యామేజ్..:
సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు కూడా ఆ పార్టీకి బిగ్ డ్యామేజ్ చేసేలా ఉన్నాయి.
రాష్ట్రంలో అవినీతిపై విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ కేంద్రాన్ని కోరుతుండటం కూడా ఆ పార్టీని ఇరుకునపెట్టేదిగా మారింది. పవన్ కల్యాణ్ పట్ల విశ్వసనీయత కలిగిన అభిమానులు, కొన్ని వర్గాల ప్రజలు ఈ ఆరోపణలు నిజమేనని భావిస్తున్నారు. పైగా ఏ తప్పు చేయకపోతే.. విచారణ అంటే ఉలిక్కి పడటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

ఏమవుతుందో...:
పరిస్థితులు ఇలాగే కొనసాగితే... చంద్రబాబు ప్రభుత్వాన్ని కేంద్రం కోర్టుకి లాగిన లాగవచ్చునని అంటున్నారు. ఒక్కసారి అవినీతి కేసుల్లో ఇరుక్కుంటే.. టీడీపీపై ఇక పెద్ద మచ్చ పడ్డట్టే. మరి,ఈ గండం నుంచి టీడీపీ గట్టెక్కుతుందా?.. లేక కేంద్రం చంద్రబాబు ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications